Social media platforms: అన్యాయంగా ప్రజలను చంపేస్తున్నాయంటూ బైడెన్ ఆగ్రహం!

ABN , First Publish Date - 2021-07-17T15:53:41+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సామాజిక మాధ్యమాల తీరుపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో కరోనా వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుండటం పట్ల బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలు అన్యాయంగా ప్రజలను చంపేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

Social media platforms: అన్యాయంగా ప్రజలను చంపేస్తున్నాయంటూ బైడెన్ ఆగ్రహం!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సామాజిక మాధ్యమాల తీరుపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో కరోనా వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుండటం పట్ల బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలు అన్యాయంగా ప్రజలను చంపేస్తున్నాయని వ్యాఖ్యానించారు. కరోనా టీకాలపై ప్రముఖ సామాజిక మాద్యమం ఫేస్​బుక్​లో దుష్ప్రచారం జరుగుతోందని, దీనిపై స్పందించాలని అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో శుక్రవారం జరిగిన మీడియ సమావేశం సందర్భంగా ఓ విలేకరి అధ్యక్షుడిని అడిగారు. దీనిపై బైడెన్ ఇలా ఘాటుగా స్పందించారు. అసత్య ప్రచారంతో ప్రజల ప్రాణాలు బలి తీసుకోవద్దని కోరారు.


ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేగాక వ్యాక్సిన్ వేసుకోనివారిలోనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటోందని గుర్తు చేశారు. కనుక సాధ్యమైనంత త్వరగా టీకాలు తీసుకోవడం మంచిదన్నారు. యూఎస్ సర్జన్ జనరల్, భారతీయ అమెరికన్ డా. వివేక్ మూర్తి కోవిడ్-19 వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించిన తర్వాతి రోజే బైడెన్ ఇలా సోషల్ మీడియాపై విరుచుకుపడ్డారు. 


వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారం ప్రచారం కావడంపై వివేక్ మూర్తి గురువారమే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఆయన 'ఇన్ఫోడెమిక్​'గా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైరస్ తన కుటుంబానికి మిగిల్చిన విషాదాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. భారత్, యూఎస్‌లో కలిపి మొత్తం 10 మంది కుటుంబ సభ్యులను మహమ్మారి కారణంగా కోల్పోయినట్లు తెలిపారు. అందుకే కరోనాను తేలికగా తీసుకొవద్దని కోరారు. వ్యాక్సిన్ల పట్ల నిర్లక్ష్యం వహించరాదని, వీలైనంత త్వరగా అందరూ టీకాలు తీసుకోవాలని సూచించారు. కేవలం టీకాల కారణంగా కరోనా అదుపులోకి వచ్చిందని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా వ్యాక్సిన్లపై అసత్య ప్రచారం జరగడాన్ని ఉపేక్షించబోమన్నారు. వెంటనే సామాజిక మాధ్యమాలు తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. లేనిపక్షంలో తామే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


మరోవైపు ఈ వ్యవహారాన్ని ఫేస్​బుక్ ప్రతినిధి డానీ లీవర్ ఖండించారు. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజానికి ఫేస్​బుక్​లో కోవిడ్-19 వ్యాక్సిన్లపై కచ్చితమైన సమాచారాన్ని 200 కోట్ల మంది చూశారని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఎక్కడ లభిస్తుందనే వివరాలను తెలిపే 'వ్యాక్సిన్ ఫైండర్ టూల్​'ను 33 లక్షల మంది అమెరికన్లు ఉపయోగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రాణాలను కాపాడటంలో ఫేస్​బుక్ ఎంతగానో సహాయపడుతోందని చెప్పడానికి ఈ గణాంకాలే సాక్ష్యమని డానీ లీవర్ చెప్పుకొచ్చారు. 

Updated Date - 2021-07-17T15:53:41+05:30 IST