తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాల ప్రదానం
ABN , First Publish Date - 2022-09-16T09:52:12+05:30 IST
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2019 ప్రతిభా పురస్కారాలను గురువారం ప్రదానం చేశారు.
వివిధ రంగాల్లో నిష్ణాతులైన 12 మందికి అందజేత
రవీంద్రభారతి, సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2019 ప్రతిభా పురస్కారాలను గురువారం ప్రదానం చేశారు. వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో తెలుగు సాహిత్యం, లలిత కళా రంగాల్లో నిష్ణాతులైన 12 మందికి ప్రతిభా పురస్కారాలను అందజేశారు. హెచ్సీయూ వీసీ బి.జగదీశ్వర్ పురస్కార గ్రహీతలను సత్కరించారు. తెలుగు వర్సిటీ సాహిత్య, కళారంగాలకు అధునాతన దేవాలయంగా నిలిచిందన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు ఆచార్య వి.వెంకటరమణ మాట్లాడుతూ ఈ పురస్కారాలు తెలుగు భాషా వికాసానికి దోహదపడతాయన్నారు. తెలుగు వర్సిటీ వీసీ టి.కిషన్రావు అధ్యక్షత వహించారు.
పురస్కార గ్రహీతలు వీరే
కవిత- వి.ఆర్.విద్యార్థి, విమర్శ- పులికొండ సుబ్బారావు, చిత్రలేఖనం-ఎం.బాలరాజ్, శిల్పం-ఎ్స.కాంతారెడ్డి, నృత్యం-ఎన్.సువర్ణలత, సంగీతం-డీవీ మోహనకృష్ణ, పత్రికా రంగం- వి.మురళి, నాటక రంగం- మల్లాది గోపాలకృష్ణ, జానపద కళారంగం- మొలంగూరి భిక్షపతి, అవధానం-ముత్యంపేట గౌరీశంకర శర్మ, ఉత్తమ రచయిత్రి- జి.పరిమళా సోమేశ్వర్, నవల-కథ- వల్లభనేని అశ్వినీకుమార్.