కారుకు ఓటేస్తే.... టైర్లకింద బతుకులు చిద్రం: ప్రవీణ్కుమార్
ABN , First Publish Date - 2021-12-23T00:37:21+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు కారుకు ఓటేసి అధికారమిస్తే ఆ టైర్ల కిందనే వారి బతుకులు చిద్రమయ్యేలా పాలన సాగిస్తున్నారని బీఎస్పీ నేత
మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు కారుకు ఓటేసి అధికారమిస్తే ఆ టైర్ల కిందనే వారి బతుకులు చిద్రమయ్యేలా పాలన సాగిస్తున్నారని బీఎస్పీ నేత ఆర్ఎస్. ప్రవీణ్కుమార్ విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్స్లో బీఎస్పీ ఆధ్వర్యంలో బుధవారం బహుజన రాజ్యాధికార సంకల్పసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రవీణ్కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని, ఇక దొరలు, గడీల పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. వడ్ల కొనుగోలుపై టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆపాలన్నారు. బహుజనులకు రాజ్యాధికారం దక్కాలనే తాను నీలికండువాను కప్పుకున్నానని చెప్పారు. ప్రజలు ఓట్లేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా సమస్యలపై ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు. పేదలు చదువుకునే సర్కార్ బడులు, యూనివర్శిటీల్లో సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బహుజనులదే రాజ్యాధికారమని ప్రవీణ్కుమార్ స్పష్టం చేశారు.