దేవదాయశాఖా మంత్రిగా మీరెందుకు?: పోతిన వెంకట మహేష్

ABN , First Publish Date - 2020-06-06T17:20:42+05:30 IST

విజయవాడ: దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఏడాదిలో ఒక్క ఆలయ పునః నిర్మాణం చేయలేదని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ విమర్శించారు.

దేవదాయశాఖా మంత్రిగా మీరెందుకు?: పోతిన వెంకట మహేష్

విజయవాడ: దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఏడాదిలో ఒక్క ఆలయ పునః నిర్మాణం చేయలేదని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ విమర్శించారు. కూలగొట్టిన దేవాలయాలు పునః నిర్మించాలని ఎన్నో ధర్నాలు చేశామని.. ఒక్క ఆలయం కూడా ఎందుకు పునః నిర్మించలేదో మంత్రి సమాధానం చెప్పాలన్నారు. ఆనాడు ఆందోళనల్లో పాల్గొన్న స్వామిజీలు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. ఆందోళనకు నాయకత్వం వహించిన శివస్వామి వైసీపీ సభ్యత్వం తీసుకున్నారేమో అనుమానం కలుగుతోందని మహేష్ పేర్కొన్నారు. స్వామి విగ్రహాలు అన్ని కార్పొరేషన్‌లో మట్టిగొట్టుకు పోతున్నాయన్నారు.


దేవాదాయశాఖ మంత్రిగా అసలు మీరెందుకని ప్రశ్నించారు. దోచుకోవడానికేనా.. ప్రతి విషయంలో రాజకీయ లబ్ది పొందాలని, డబ్బు సంపాదించాలని చూస్తున్నారని విమర్శించారు. దుర్గ గుడి సేవ టికెట్లు నకిలీ వెబ్ సైట్లపై ఒక కంప్లైంట్ ఇచ్చి వదిలేశారన్నారు. దేవాదాయ ఆస్తుల అమ్మకంపై మంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారని మహేష్ పేర్కొన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా చేస్తున్నారన్నారు. మంత్రి నిర్లక్ష్యం వల్లే పశ్చిమ నియోజకవర్గంలో కరోనా కేసులు పెరిగాయన్నారు. వీరి కారణంగా కరోనా వచ్చి.. కొంతమంది ప్రాణాలు కోల్పోయారన్నారు. అధికారులు కూడా ఒత్తిడులకు లొంగకుండా నిబంధనల మేరకు నడచుకోవాలన్నారు. కలెక్టర్, సీపీలు స్పందించి వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని పోతిన వెంకట మహేష్ కోరారు.

Updated Date - 2020-06-06T17:20:42+05:30 IST