పాజిటివిటీ రేటు పైపైకి
ABN , First Publish Date - 2020-08-12T08:51:21+05:30 IST
రాష్ట్రంలో కరోనా కేసుల పాజిటివిటీ రేటు భారీగా పెరిగింది. సరిగ్గా రెండువారాల కిందట అంటే జూలై 28వ తేదీన ఈ రేటు 6.30శాతం
- 15 రోజుల్లో 50 శాతం పెరుగుదల
- 6.30 శాతం నుంచి 9.43 శాతానికి
- దేశవ్యాప్తంగా 0.42 శాతమే పెంపు
- 2 వారాల్లో 1.34 లక్షల కొత్త కేసులు
- ఇదే సమయానికి 1,055 మంది బలి
రాష్ట్రంలో కరోనా కేసుల పాజిటివిటీ రేటు భారీగా పెరిగింది. సరిగ్గా రెండువారాల కిందట అంటే జూలై 28వ తేదీన ఈ రేటు 6.30శాతం కాగా ఈ నెల 11నాటికి 9.43శాతానికి చేరింది. కేవలం 15రోజుల వ్యవధిలోనే సుమారు 50శాతం పెరుగుదల నమోదైంది. గతనెల 28న రాష్ట్రంలో కరోనా కేసులు 1,10,297 ఉన్నాయి. మంగళవారం నాటికి ఈ సంఖ్య 2,44,549కి పెరిగింది. 15రోజుల వ్యవధిలో 1,34,252 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు పెరగడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇదే సమయానికి దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు మాత్రం స్థిరంగానే ఉండటం గమనార్హం.
గత నెల 28న దేశ పాజిటివిటీ రేటు 8.55గా ఉంది. 15రోజుల తర్వాత కేవలం 0.42శాతం పెరిగి 8.97శాతానికి చేరింది. జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరణాల నమోదు కూడా ఇదే స్థాయిలో ఉంది. గతనెల 28న రాష్ట్రవ్యాప్తంగా 1,148మంది కరోనాతో మృతిచెందారు. మంగళవారం నాటికి ఇవి 2,203కు పెరిగాయి. కేవలం అంటే రెండువారాల్లోనే 1,055 మంది వైర్సకు బలయ్యారు. రోజువారీగా నమోదవుతున్న మరణాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.