కాల్ సెంటర్లు పెట్టి కథ నడిపిస్తున్న చైనా యాప్లు!
ABN , First Publish Date - 2020-12-19T06:55:39+05:30 IST
మొన్న మౌనిక.. నిన్న సునీల్... అంతకుముందు శ్రవణ్... ఇలా ఇన్స్టెంట్లోన్ల పేరుతో దా‘రుణ’యా్పల వలకు చిక్కి..
పీడించే ఆ దా‘రుణ’ యాప్లన్నీ చైనావే!
చిరునామాల్లేవ్.. కాల్ సెంటర్ల ద్వారానే వేధింపులు
నిర్వాహకులపై చర్యలకు పోలీసులు సన్నద్ధం
ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా 60 యాప్లు
రిజిస్టర్ అయిన యాప్ల పేర్లు ఇవ్వండి.. ఆర్బీఐకి లేఖ
చట్టబద్ధతలేని యాప్ల నుంచి రుణాలు తీసుకోవద్దు
వేధింపులకు పాల్పడితే ఫిర్యాదు చేయండి: డీజీపీ
హైదరాబాద్, డిసెంబరు 18 ‘ఆంధ్రజ్యోతి): మొన్న మౌనిక.. నిన్న సునీల్... అంతకుముందు శ్రవణ్... ఇలా ఇన్స్టెంట్లోన్ల పేరుతో దా‘రుణ’యా్పల వలకు చిక్కి.. అప్పులు తీర్చాలంటూ వారి ఒత్తిళ్లకు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడితే, మానసిక వేదనను అనుభవిస్తున్నవారు ఇంకెందరో! సదరు యాప్ల ఆటకట్టించేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయ అధికారులే స్వయంగా రంగంలోకి దిగారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఆన్లైన్ యాప్లకు ఆర్బీఐ అనుమతి లేదని.. అందులో చాలా మటుకు చైనీస్ యాప్లే ఉన్నట్లు కనుగొన్నారు.
ఆయా యాప్లకు రిజిస్టర్ అయిన చిరునామాలు సరిగా లేవని గుర్తించారు. ఆయా కేసులన్నింటినీ పరిశీలించి బాధ్యులైన యాప్ నిర్వహకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైం నిపుణులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. ఇప్పటికే ఆయా కేసుల్లో మృతుల సెల్ఫోన్ల నుంచి, కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వారంతా కూడా ఇన్స్టెంట్ యాప్ల వేధింపుల వల్లే మృతిచెందినట్లు తెలుసుకొని కేసులు నమోదు చేశారు.
కాగా తీసుకున్న అప్పును తిరిగి రాబట్టే క్రమంలో అప్పు తీసుకున్న వారికి.. వారి కాంటాక్టు లిస్ట్లో ఉన్నవారికి ఫోన్లు చేయడం, వాట్సాప్ సందేశాలు పంపడం వంటి పనుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్లను నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. ఈ మేరకు యాప్ నిర్వహకులతోపాటు కాల్ సెంటర్ నిర్వహకులపై చట్టపరమైన తీసుకునేందుకు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. రాజేంద్రనగర్, సిద్దిపేటలో నమోదైన కేసుల్లో బాధితులు రుణం తీసుకున్న యాప్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సైబర్ క్రైం పోలీసులు సేకరించారు. కాగా ఆత్మహత్య చేసుకున్న సునీల్, 35 యాప్ల నుంచి ఆన్లైన్లో రుణం తీసుకున్నట్లు గుర్తించారు.
చట్టబద్ధత లేనివి డౌన్లోడ్ చేయొద్దు
రుణ యాప్లలో చాలామటుకు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధగా ఉన్నాయని, ఆర్బీఐ వద్ద రిజిస్టర్ అవ్వని యాప్లను డౌన్లోడ్ చేసుకోవొద్దని ప్రజలకు డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. ఇన్స్టెంట్ లోన్ల పేరుతో బురిడీ కొట్టించి యాప్లను నమ్మి మోసపోవద్దని, ఆ యాప్ల నుంచి ఇప్పటికే రుణాలు పొందినవారు వేఽధింపులకు గురైతే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఎదుటి వారికి ఇవ్వరాదని చెప్పారు. ఫోన్ కాంటాక్ట్స్, ఫోటోలు తీసుకుని ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని హెచ్చరించారు.
రోజుకు 1% వడ్డీ.. ఆలస్యమైతే అంతకు రెండింతలు
యాప్ల ద్వారా అందించే రుణాల వడ్డీ రోజుకు ఒక శాతం వరకు ఉంటుంది. ఇది సాధారణంగా బ్యాంకులు, ఎన్బీఎ్ఫసీ రిజిస్ట్రర్ అయిన సంస్థలు అందించే రుణ వడ్డీలకన్నా చాలా ఎక్కువ. సకాలంలో చెల్లించకపోతే వడ్డీ రెండు, మూడు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తారు. తీసుకున్న దానికి పది రెట్లు ఎక్కువగా చెల్లించాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబం, తెలిసిన వారి వద్ద పరువు పోయిందనే మానసిక వ్యధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
పేర్లు మార్చి... ఏమారుస్తున్నారు
ఇన్స్టెంట్ రుణాలపేరుతో మోసాలకు పాల్పడుతున్న పలు ఆన్లైన్ యాప్లపై ఫిర్యాదులు రావడంతో గూగుల్ప్లే స్టోర్ నుంచి వాటిని తొలగించారు. కొన్ని యాప్లను పేర్లను మార్చి మళ్లి ప్లే స్టోర్లోకి అప్లోడ్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణతోపాటు, ఇటీవల ఏపీలో నమోదైన కేసుల్లో ఈ తరహా మోసాలు జరిగినట్లు గుర్తించారు.
కాగా ఇన్స్టెంట్ లోన్ పేరుతో గూగుల్ ప్లేస్టోర్లో 60 యాప్లు ఉన్నట్లు తెలంగాణ పోలీ్సలు గుర్తించారు.వీటిల్లో చాలా మటుకు ఆర్బీఐ, ఎన్బీఎ్ఫసీ నుంచి గుర్తింపు లేదు. యాప్ స్టోర్ నిబంధనల్నీ అతిక్రమిస్తున్నందున వాటిని తొలగించమని కోరేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అలాగే చట్టబద్ధత ఉన్న యాప్ల వివరాలు ఇవ్వాలని ఆర్బీఐకి పోలీసులు లేఖ రాశారు.