Gangrape కేసులో మైనర్లకు 4 రోజుల కస్టడీ
ABN , First Publish Date - 2022-06-09T22:49:48+05:30 IST
గ్యాంగ్రేప్ (Gangrape) కేసులో మైనర్లకు 4 రోజుల కస్టడీలోకి పోలీసులు తీసుకోనున్నారు. రేపటి నుంచి జువైనల్ కోర్టు
హైదరాబాద్: గ్యాంగ్రేప్ (Gangrape) కేసులో మైనర్లకు 4 రోజుల కస్టడీలోకి పోలీసులు తీసుకోనున్నారు. రేపటి నుంచి జువైనల్ కోర్టు నిందితులను పోలీసులు విచారించేందుకు కస్టడీకి అనుమతిచ్చింది. 14వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. కస్టడీకి అనంతరం మైనర్లను జువైనల్ హోం తరలించాలని కోర్టు ఆదేశించింది. జువైనల్స్ తమ అడ్వొకేట్ను కలిసేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఇప్పటికే ఈ కేసులో నిందితుడు సాదుద్దీన్ మాలిక్ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. మైనర్లతో మాలిక్కు ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసులో ఆరుగురు నిందితులు కాకుండా ఇతర వ్యక్తులపైనా ఆరా తీస్తున్నారు. మైనర్లను కస్టడీకి ఇస్తే మరికొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
తొలుత ఇద్దరు మేజర్లని చెప్పి..
అత్యాచార ఘటనలో పాల్గొన్న ఐదుగురిలో ఇద్దరు మేజర్లు.. ముగ్గురు మైనర్లు ఉన్నారని పోలీసులు తొలుత ప్రకటించారు. కానీ మేజర్లుగా ఉన్న ఇద్దరిలో ఒకరికి 18 ఏళ్లు నిండటానికి మరో నెల రోజులు మిగిలి ఉన్నాయని తెలుసుకున్న పోలీసులు అతన్ని కూడా మైనర్గానే పరిగణించారు. నిందితుల్లో సాదుద్దీన్ మాలిక్ ఓ టీఆర్ఎస్ నేత కుమారుడు కాగా.. ఇద్దరు మైనర్లు కూడా టీఆర్ఎస్ నేతల కుమారులని తెలిసింది. మరొకరు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కుమారుడు, ఇంకొకరు సంగారెడ్డి కార్పొరేటర్ కుమారుడు.. తాజాగా చేరిన మైనర్ మాత్రం ఓ ఎమ్మెల్యే కుమారుడు కావడం గమనార్హం.