ప్లీజ్.. నన్ను వదిలేయండి!
ABN , First Publish Date - 2022-08-15T09:49:24+05:30 IST
‘నేను బలహీనవర్గానికి చెందినవాడిని. ప్లీజ్.. ఇకనైనా నన్ను వదిలేయండి’ అని ఏపీలోని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియా యాజమాన్యాలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు.
మీడియాకు ఎంపీ మాధవ్ వినతి
అనంతపురం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ‘నేను బలహీనవర్గానికి చెందినవాడిని. ప్లీజ్.. ఇకనైనా నన్ను వదిలేయండి’ అని ఏపీలోని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియా యాజమాన్యాలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘కమ్మ సామాజకవర్గానికి చెందిన వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. కమ్మ సోదరుల్లో నన్ను ఇబ్బంది పెట్టినవారిని మాత్రమే ఆవేశంలో ఏదో అన్నాను’ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మళ్లీ ఆరోపణలు గుప్పించారు. నగ్న వీడియో బహిర్గతమైన తర్వాత తొలిసారి మాధవ్ ఆదివారం అనంతపురానికి వచ్చారు. వైసీపీ కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. 30 పోలీస్ యాక్టు అమలులో ఉన్నప్పటికీ.. దానిని ఉల్లంఘించి పదుల సంఖ్యలో వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్కు బాగా అంతరాయం ఏర్పడింది. అయితే మాధవ్ సామాజిక వర్గం కురుబ సంఘాల ముఖ్య నేతలెవరూ కనబడలేదు.