ఐపీఎల్లో రాణించాలంటే ఇవి పాటించాల్సిందే: సురేష్ రైనా
ABN , First Publish Date - 2020-08-07T02:36:52+05:30 IST
ఐపీఎల్ ఆడబోతున్న ఆటగాళ్లు మానసికంగా దృఢంగా ఉండాలని బ్యాట్స్మన్ సురేష్ రైనా..
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఆడబోతున్న ఆటగాళ్లు మానసికంగా దృఢంగా ఉండాలని బ్యాట్స్మన్ సురేష్ రైనా అన్నాడు. ఐపీఎల్-2020 వచ్చే నెల 19 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆటగాళ్ళు మానసిక స్థితి ఎలా ఉండాలో రైనా విశ్లేషించాడు. ఆటగాళ్లు తమ ఆటపై దృష్టి సారించాలన్నాడు. ‘ఎట్టకేలకు ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభం అవుతోంది. టోర్నీలో ఆడేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే 5నెలలుగా ఇంటికే పరిమితమయ్యాను. ఈ కారణంగానైనా ప్రశాంతంగా ఆడగలుగుతానని అనుకుంటున్నాను. ఈ సారి ఆటగాళ్లు ఎప్పుడూ చూడని పరిస్థితులలో ఐపీఎల్కు సిద్ధం అవుతున్నారు. ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి ఐసీసీ కూడా కొత్త నిబంధనలను అమలు చేయనుంది. వీటన్నింటిని క్రికెటర్లు ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ప్రతి ప్లేయర్ తన ఆటను ఆస్వాధించాలి. ఆటగాళ్లు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా తమ ప్రతిభను కనబరచడంలో విఫలమయ్యే అవకాశాలున్నాయి. ప్రతి రెండు, మూడు వారాలకీ వైద్య పరీక్షలకు హాజరు కావాలి. వైద్య పరీక్షలన్నీ ఐపీఎల్కు ముందుగానే పూర్తవుతాయనే అనుకుంటున్నాన’ని రైనా పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే మిగిలిన జట్ల కంటే ముందుగానే యూఏఈ చేరబోతున్నామనీ, అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకే జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపాడు.