ప్లాస్మాదాతలూ పేర్లు నమోదు చేసుకోవచ్చు!

ABN , First Publish Date - 2020-08-17T08:18:37+05:30 IST

ఎంతో మందితో రక్తదానం చేయించి, అవసరమైన వారికి రక్తాన్ని అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న..

ప్లాస్మాదాతలూ పేర్లు నమోదు చేసుకోవచ్చు!

  • ఫ్రెండ్స్‌2సపోర్ట్‌ సంస్థ వెబ్‌సైట్‌ ప్రారంభం
  • తెలంగాణ, ఏపీ నుంచి 150 మంది పేర్ల నమోదు


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ఎంతో మందితో రక్తదానం చేయించి, అవసరమైన వారికి రక్తాన్ని అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఫ్రెండ్స్‌ 2 సపోర్ట్‌ సంస్థ తాజాగా ప్లాస్మాదానంపైనా దృష్టి సారించింది. ఫ్రెండ్స్‌ 2 సపోర్ట్‌.ఓఆర్జీ వెబ్‌సైట్‌ అప్లికేషన్‌లో ‘కొవిడ్‌-19 ప్లాస్మాదాత’ అంశాన్ని కొత్తగా చేర్చింది. ప్లాస్మాదాతను గుర్తించడంలో కొవిడ్‌ బాధితుల  బంధువులు, వైద్య సిబ్బంది పనిని సులభతరం చేసేందుకు, ఆందోళనకరంగా ఉన్న కొవిడ్‌ రోగుల ప్రాణాలను రక్షించడానికి తమ వంతు సాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. వారం రోజుల నుంచి ఈ అంశంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ట్రయల్‌ నిర్వహించినట్లు సంస్థ వ్యస్థాపకుడు షేక్‌ ఖాసీం షరీఫ్‌ తెలిపారు. కాగా, ప్లాస్మా దాతల వివరాల సేకరణను ఆదివారం నుంచి ప్రారంభించారు. 


సాయంత్రం 5 గంటల వరకే 150 మంది దాతలు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. వివరాలు తమ వెబ్‌సైట్‌లో బ్లడ్‌ గ్రూప్‌ వారీగా నమోదు చేసి పెడుతున్నారు. దాతల వివరాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, గ్రామాల సమాచారంతో పాటు ఫోన్‌ నంబర్లతో పూర్తి సమాచారం అందులో పొందుపరుస్తున్నట్లు తెలిపారు. కరోనా బాధితులకు సాయం అందించాలనుకునే వారు స్వచ్ఛందంగా ఊటజ్ఛీుఽఛీట2టఠఞఞౌట్ట.ౌటజలో ప్లాస్మాదాతలుగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్లాస్మా అవసరమైన వారు తమ వెబ్‌సైట్‌లోని దాతల గ్రూప్‌లోకి వెళ్లి వారితో నేరుగా సంప్రదించవచ్చునని షరీఫ్‌ వివరించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఉండేందుకు ఈ సుదపాయాన్ని కల్పించినట్లు ఆయన చెప్పారు. ప్లాస్మా దాతలకు అవగాహన కల్పించడానికి విస్తృత ప్రచారం చేపట్టినట్లు తెలిపారు. రక్తం కోసం ఇబ్బంది పడకుండా ఉండడానికి 2005లో ఫ్రెండ్స్‌2సపోర్ట్‌ సంస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వెబ్‌సైట్‌లో ఆరు దేశాలకు చెందిన 5 లక్షల మంది రక్తదాతలు స్వచ్ఛందంగా తమ పేర్లును నమోదు చేసుకున్నారని వివరించారు. ఇప్పటివరకు రెండు సార్లు ఐరాస నుంచి అవార్డు అందుకున్నట్లు చెప్పారు.

Updated Date - 2020-08-17T08:18:37+05:30 IST