పెట్రో భారం ఒక పెన్నిధి !

ABN , First Publish Date - 2021-03-09T06:55:41+05:30 IST

పెట్రోల్ ధర తాజా పెరుగుదల వినియోగదారుని దృష్టికోణంనుంచి సమర్థనీయంగా కన్పించడం లేదు. అయితే పెట్రోలియం ఉత్పత్తుల ధరల...

పెట్రో భారం ఒక పెన్నిధి !

పెట్రోల్ ధర తాజా పెరుగుదల వినియోగదారుని దృష్టికోణంనుంచి సమర్థనీయంగా కన్పించడం లేదు. అయితే పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల ప్రభావం సంపన్నుల పై అధికంగాను, పేద లపై తక్కువగాను ఉండవచ్చనే అభిప్రాయానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. ఈ విషయమై మన దేశంలో జరిగిన అధ్యయనాలు నాకు అందుబాటులో లేవు. 


వర్ధమాన ఆఫ్రికా దేశం మాలి పెట్రో ధరల పెరుగుదల ప్రభావం సంపన్నుల పైనే అధికంగా ఉంది. చమురు ధరల పెరుగుదల వల్ల ఉన్నత వర్గాలవారు ప్రతి లీటర్ పెట్రోల్ కు అదనంగా 80 పైసలు చెల్లిస్తే పేదలు కేవలం 5 పైసలు మాత్రమే చెల్లిస్తున్నారు! అల్పాదాయ వర్గాల వారి కంటే కులీన వర్గాల వారు 16 రెట్లు ఎక్కువగా పెట్రో భారాన్ని భరిస్తున్నారు, మాలిలో ఉన్న పరిస్థితులే మన దేశంలోనూ ఉన్నాయి. చమురు ధరల పెరుగుదల భారాన్ని సంపన్నులే అధికంగా మోస్తున్నారనేది స్పష్టం. మరి ‘ ఆమ్ ఆద్మీ’ శ్రేయస్సు పేరిట పెట్రో ధరల పెరుగుదలను వ్యతిరేకించడం ఆమోదయోగ్యం కాదు. కార్మికులకు యూనిఫామ్ సమకూర్చని ఫ్యాక్టరీ యజమాని ఒకరు బట్టధర పెరుగుదల వల్లే యూనిఫామ్ ఇవ్వలేక పోతున్నానని సంజాయిషీ ఇవ్వడం సబబేనా? అలాగే సగటు మనిషిని సాకుగా చూపి చమురు ధలను వ్యతిరేకించడం సహేతుకం కానే కాదు. 


వాస్తవానికి చమురు ధల పెరుగుదల వల్ల పరోక్ష ప్రయోజనాలు అనేకమున్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగితే వాటి వినియోగం గణనీయంగా తగ్గి పోతుంది.చమురు వినియోగం 10 శాతం మేరకు పెరిగిపోతే పోతే అందుకనుగుణంగా పెట్రోల్ వినియోగం 0.4 శాతం మేరకు తగ్గిపోతుంది. చెప్పవచ్చిందేమిటంటే పెట్రోల్ ధర పెరుగుదల వినియోగం తగ్గుదలకు దారితీసి దేశ ఆర్థిక వ్యవస్థపై చమురు దిగుమతుల భారాన్ని తగ్గిస్తుంది. మనం ప్రస్తుతం మన ఉత్పత్తులను, డాలర్ల ఆర్జన తప్పనిసరై తక్కువ ధరలకే ఎగుమతి చేస్తున్నాం. చమురు దిగుమతుల భారం తగ్గితే మన ఉత్పత్తులను వాటి విజమైన ధరకే ఎగుమతి చేయడం సాధ్యమవుతుంది. చమురు ధరల పెరుగుదల వల్ల సమకూరే రెండో ప్రయోజనం ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అభివృద్ధి పరచుకోవడం. ఉదాహరణకు సౌర శక్తితో నడిచే విద్యుత్ కారును కొనగోలు చేసుకోవడం వినియోగదారులకు లాభ దాయకమవుతుంది. చమురు ధరలు ఎంతకూ దిగిరానిపక్షంలో విద్యుత్ కారులను కొనుగోలు చేసుకోవడం మినహా వినియోగదారులకు మరో గత్యంతరం ఉండదు. మూడో పరోక్ష ప్రయోజనం పర్యావరణ లబ్ధి. అపరిమిత స్థాయిలో చమురు వినియోగం వల్ల కార్బన్ ఉద్గారాలు ఇతోధికంగా పెరుగుతాయి. ఈ ఉద్గారాలతో భూ వాతావరణం మరింతగా వేడెక్కి కరువు కాటకాలు, వరదలు మొదలైన పర్యావరణ విపత్తులు పెచ్చరిల్లుతాయి. చమురు, బొగ్గు ధరలు పెరిగితే వాటి వినియోగం తగ్గి   భూ వాతావరణం వేడెక్కడం కూడా బాగా తగ్గుతుంది. ఇక్కడొక తప్పనిసరి హెచ్చరిక. పెట్రోల్ కు ప్రత్యామ్నాయంగా వాడేందుకు వ్యవసాయ దిగుబడుల నుంచి ఈథనాల్ ను ఉత్పత్తిచేయకూడదు. అలాగే నదులపై ఆనకట్టలు కట్టి విద్యుదుత్పాదనకు పూనుకోకూడదు. మన మన అమూల్య సహజ వనరులు అయిన నీరు, నేలను ఈథనాల్ రూపేణా మార్చివేసి . దాన్ని పెట్రోల్ స్థానంలో వాడుకోవడం తగదు. మనం మన మత్స్య సంపదను , అడవులను మనమే ధ్వంసం చేసుకొంటున్నాం. ఈ విధ్వంస కాండ ను నిలిపివేయకపోతే ఉత్తరాఖండ్ లో ఇటీవల సంభవించిన విపత్కర పరిణామాలు పదే పదే సంభవిస్తాయనడంలో సందేహం లేదు. 


కొవిడ్ మహమ్మారి వల్ల మన ప్రభుత్వం తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటోంది. ఈ లోటును భర్తీ చేసుకొని ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు ప్రపజలపై ఏదో ఒక విధంగా పన్నులు వేయవలసి ఉంటుంది. అయితే ప్రభుత్వం అధిక పన్నును చమురు పై విధిస్తుందా లేక వస్త్రాలపై విధిస్తుందా అన్నది ముఖ్యం. ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో పన్నులను పెంచడంపై ప్రభుత్వాన్ని విమర్శించడం సమర్థనీయం కాదు. అది సహేతుకమైన విమర్శకాబోదు. చమురుపై అధికపన్నుల ద్వారా ఆర్జిస్తున్న రాబడిని ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధిపరచడం ద్వారా చమురు వినియోగాన్ని తగ్గించేందుకు ఉపయోగిస్తున్నారా లేదా అన్నది చాలా ముఖ్యం. ఉపయోగించనిపక్షంలో ప్రభుత్వాన్ని తప్పక విమర్శించాలి. అది సహేతుకమైన విమర్శ అవుతుంది. ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హై వే లను నిర్మిస్తోంది. ఇది సరైన చర్యే. అంతే కాదు, అమిత నిర్మాణాత్మక పని, సందేహం లేదు. అయితే ఆ హై వేలపై ప్రైవేట్ కార్లకు కాకుండా ప్రజా రవాణా వ్యవస్థ వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వాల్సిన అవసరమున్నది. నగరాలలో మెట్రో వ్యవస్థలను తప్పక అభివృద్ధి పరచాలి. దీనివల్ల ప్రయాణాలలో ఇంధన వినియోగాన్ని తగ్గించుకోగలుగుతాం. 


ప్రభుత్వ వినియోగం వల్ల ప్రజలపై పడుతున్న భారాన్ని సాధ్యమైనంతగా తగ్గించవలసిన బాధ్యత పాలకులపై ఉంది. చమురు ధరల పెరుగుదల మూలంగా ప్రజలు-సంపన్నులూ, పేదలు- అదనంగా నూ.100 చెల్లించవలసి వలసివచ్చిందనుకోండి. ఆ మేరకు ప్రభుత్వం తన వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఆ తగ్గింపునకు నైష్పత్తికంగా పన్నులను కూడా తగ్గించితీరాలి. 


కొవిడ్ మహమ్మారి మూలంగా సామాన్య మానవుల ఆదాయాలు గణనీయంగా తగ్గిపోయాయి. అదే సమయంలో ప్రభుత్వోద్యోగుల ఆదాయం, వినియోగం మహమ్మారి పూర్వపు స్థాయిలోనే కొనసాగాయి. ప్రభుత్వోద్యోగులు అంత విలయంలోనూ ఆనందంగా ఉండగా ప్రజలు ( వీరి సేవలకే కాదూ సర్కార్ సిబ్బంది నియమితులయ్యింది?) మాత్రం ఆదాయాలను కోల్పోయి పేదరికంలోకి జారిపోయారు. మరి ఈ పరిస్థితుల్లో పాలకుల విధ్యుక్త ధర్మమేమిటి? చమురు ధరలు పెంచవచ్చు. అయితే ఈ పెంపుదల వల్ల సమకూరుతున్న అధిక ఆదాయాన్ని సక్రమంగా వినియోగించితీరాలి. ఆపత్కాలంలో ప్రజల పట్ల ప్రభుత్వం నిర్వహించాల్సిన నైతిక కర్తవ్యం ఇంతకంటే మరేముంటుంది?


భరత్ ఝున్‌ఝున్‌వాలా

Updated Date - 2021-03-09T06:55:41+05:30 IST