ఐపీఎల్ మ్యాచ్లు ఇక్కడ వద్దు.. సీఎంకు లేఖ రాసిన స్థానికులు
ABN , First Publish Date - 2021-04-08T23:40:49+05:30 IST
దేశంలో కరోనా పరిస్థితులు పెరుగుతున్నా.. ముందుగా అనుకున్నట్లే భారత క్రికెట్ బోర్డు ఇండియన్ ప్రీమియర్ లీగ్ను మొదలు పెట్టేసింది. దీనికోసం ప్రత్యేక నిబంధనలను అవలంబిస్తోంది. స్టేడియాలకు ప్రేక్షకులను నిషేధించడం, ఆటగాళ్లను బయోబబుల్లో ఉంచడం తదితర రూల్స్ను..
ముంబై: దేశంలో కరోనా పరిస్థితులు పెరుగుతున్నా.. ముందుగా అనుకున్నట్లే భారత క్రికెట్ బోర్డు ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేసేసింది. శుక్రవారం తొలి మ్యాచ్ జరగనుంది. టోర్నీకి కరోనా సెగ తగలకుండా ప్రత్యేక నిబంధనలను అవలంబిస్తోంది. ఆటగాళ్లను బయోబబుల్లో ఉంచడం, స్టేడియాలకు ప్రేక్షకులను నిషేధించడం తదితర రూల్స్ను కఠినంగా అమలు చేస్తోంది. అంతేకాకుండా మ్యాచ్ల కోసం దేశంలోని 6 మైదానాలను మాత్రమే ఎంపిక చేసింది. వాటిలో ముంబైలోని ప్రముఖ వాంఖడే స్టేడియం కూడా ఒకటి. కాగా.. ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే వాంఖడే సమీపంలోని ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు ఓ లేఖ రాశారు.
ఐపీఎల్ మ్యాచ్లను ముంబైలో నిర్వహించవద్దంటూ ఆ లేఖలో కోరారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇక్కడ మ్యాచ్లు నిర్వహిస్తే పరిస్థితులు మరింత చేజారే దుస్థితి ఏర్పడవచ్చని ఆ లేఖలో రాసుకొచ్చారు. స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి లేకపోయినా, ఆటగాళ్లు వేదిక చేరుకున్నాక తమ అభిమాన ఆటగాడిని చూడాలనే ఆశతో ప్రజలు స్టేడియం బయట గూమికూడే అవకాశం ఉందని, తద్వారా కరోనా మరింత పెరిగే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వివాహాలు, మరణాలు మొదలైన మతపరమైన, ఇతర సామాజిక కార్యకలాపాల విషయంలో ఆంక్షలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లకు మాత్రం ఎలా అనుమతినిస్తుందని తమ లేఖతో మహారాష్ట్ర సర్కార్ను నిలదీశారు. మరి దీనిపై సీఎం ఉద్ధవ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇదిలా ఉంటే రేపటి(శుక్రవారం) నుంచి ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. మరి తొలి మ్యాచ్లో గెలిచి ఏ జట్టు బోణీ కొడుతుందో వేచి చూడాలి.