ఈ నెల పింఛన్లు, జీతాలు 3 తర్వాతే!
ABN , First Publish Date - 2020-07-01T08:20:17+05:30 IST
రాష్ట్రంలో జూలై నెలకు సంబంధించిన లబ్ధిదారుల పింఛన్లు, ఉద్యోగుల జీతాల చెల్లింపులు మూడో తేదీ తర్వాతే జరగనున్నాయి. 1, 2 తేదీల్లో చెల్లింపులు జరిగే అవకాశం లేదు.
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జూలై నెలకు సంబంధించిన లబ్ధిదారుల పింఛన్లు, ఉద్యోగుల జీతాల చెల్లింపులు మూడో తేదీ తర్వాతే జరగనున్నాయి. 1, 2 తేదీల్లో చెల్లింపులు జరిగే అవకాశం లేదు. బడ్జెట్కి సంబంధించిన అప్రాప్రియేషన్ బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందక పోవడంతో నిధుల వినియోగానికి సంబంధించిన ఇబ్బంది ఏర్పడింది. అయితే, ఇది ద్రవ్యబిల్లు కావడంతో చట్ట సభల ఆమోదం లేకున్నా.. 14 రోజుల తర్వాత ఈ బిల్లును ఆమోదం పొందినట్లుగా భావిస్తారు. ద్రవ్యబిల్లును జూన్ 17న మండలిలో ప్రవేశ పెట్టారు. కాబట్టి జూలై 1కి 14 రోజులు పూర్తవుతాయి. దీనిని బట్టి.. 2వ తేదీన బిల్లును ఆమోదం కోసం గవర్నర్కి పంపనున్నారు. ఆ రోజు గవర్నర్ ఈ బిల్లును ఆమోదిస్తే 3వ తేదీ నుంచి బడ్జెట్ అమల్లోకి వస్తుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ఒక జీవో జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో 1, 2 తేదీల్లో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ లతో సహా ఇతర చెల్లింపులు పూర్తిగా నిలిచిపోనున్నాయి.