పెన్షన్‌ కోసం 82 కి.మీ. ప్రయాణం

ABN , First Publish Date - 2022-01-02T01:31:14+05:30 IST

ప్రతినెల ఒకటో తేదీన వలంటీర్లు ఇంటి వద్దకు వచ్చి పెన్షన్‌ సొమ్మును చేరవేస్తారని ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటం అంతాఇంతా కాదు.

పెన్షన్‌ కోసం 82 కి.మీ. ప్రయాణం

ఆత్మకూరు: ప్రతినెల ఒకటో తేదీన వలంటీర్లు ఇంటి వద్దకు వచ్చి పెన్షన్‌ సొమ్మును చేరవేస్తారని ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటం అంతాఇంతా కాదు. అయితే ప్రచారంలో ఉన్నంత ఉత్సాహం ఆచరణలో కనిపించడం లేదు. ప్రత్యేకించి కర్నూలు జిల్లా నల్లమల అంతర్భాగంలో ఉన్న పెచ్చెర్వు చెంచులకు ఈ సేవలు సక్రమంగా చేరడం లేదు. పెచ్చెర్వు చెంచుగూడెంలో 94 కుటుంబాలు ఉండగా 215 మంది జనాభా ఉంది. వీరిలో 28 మందికి వృద్ధాప్య, వితంతు పెన్షన్‌‌లు అందుతున్నాయి. అయితే గూడెంలో పనిచేస్తున్న అర్తి నాగరాజు అనే వలంటీరు మానుకోవడంతో మూడు నెలలుగా స్థానికంగా పెన్షన్‌‌లు ఇవ్వడం లేదు. దీంతో పెచ్చెర్వు చెంచులు రానుపోను 82 కి.మీ. ప్రయాణం చేయాల్సి వస్తోంది. వలంటీర్‌ ఉన్నప్పుడు పెచ్చెర్వులో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ వచ్చే ప్రదేశానికి చెంచులు వెళ్లి డబ్బులు తీసుకునేవారు. అయితే ప్రస్తుతం వలంటీర్‌ లేకపోవడంతో 41 కి.మీ. దూరంలో ఉన్న ఆత్మకూరుకు వెళ్లి పెన్షన్‌‌ సొమ్ము తీసుకుంటున్నారు. అటవీ మార్గం సక్రమంగా లేకపోవడంతో ఒక్కొక్కరు రాకపోకలకు రూ.500 చెల్లించాల్సి వస్తోంది. దీంతో పెన్షన్‌‌ పొందాలంటే పెచ్చెర్వు చెంచులు వ్యయప్రయాసలు భరించక తప్పడం లేదు. 

Updated Date - 2022-01-02T01:31:14+05:30 IST