విద్యుత్ ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు: పెద్దిరెడ్డి
ABN , First Publish Date - 2022-04-19T00:29:13+05:30 IST
దేశం మొత్తం విద్యుత్ ఇబ్బందులను ఎదుర్కొంటోంది.. రాష్ట్రంలో వాటిని అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
అమరావతి: దేశం మొత్తం విద్యుత్ ఇబ్బందులను ఎదుర్కొంటోంది.. రాష్ట్రంలో వాటిని అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి అదనంగా మరో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కృష్ణపట్నం, ఎన్టీటీపీఎస్ల్లో 800 మెగావాట్ల విద్యుత్ యూనిట్లు, హైడెల్ ప్లాంట్ల ద్వారా మరో 6000 మెగావాట్ల ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. మే ఒకటి నుంచి సాధారణ స్థాయికి విద్యుత్ ఉత్పత్తి వస్తుందన్నారు. ఏపీలో నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు హయాంలో విద్యుత్ ఉద్యమంలో ముగ్గురిని పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. అలాంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఉండవని చెప్పారు. వ్యవసాయం, పరిశ్రమలకు అండగా ఉంటామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హామీ ఇచ్చారు.