శాంతమ్‌ పాపమ్‌!

ABN , First Publish Date - 2020-08-03T06:03:13+05:30 IST

చింతనాశీలి, రచయిత పి.రామకృష్ణ గుండె లోతుల్లోంచి వెలువడ్డ ‘రచయిత ఆత్మఘోష’ (వివిధ, 29 జూన్‌ 2020) ఆయనొక్కడి ఆత్మ నివేదనమే కాదు, ఆయనలాంటి ఎంతోమంది...

శాంతమ్‌ పాపమ్‌!

చింతనాశీలి, రచయిత పి.రామకృష్ణ గుండె లోతుల్లోంచి వెలువడ్డ ‘రచయిత ఆత్మఘోష’ (వివిధ, 29 జూన్‌ 2020) ఆయనొక్కడి ఆత్మ నివేదనమే కాదు, ఆయనలాంటి ఎంతోమంది సృజనాత్మక, విమర్శనాత్మక రచయితల సామూ హిక వేదనే మరి. అయితే సంవేదనాశీలి అయిన పి. రామకృష్ణ వ్యథా భారాన్ని నిగ్రహించుకోలేక అక్షరరూపం ఇచ్చుకోగలిగాడు. మిగతా రచయితలు మూగబాధ అనుభవిస్తూ మిన్నకుండిపొయ్యారు అంతే. నూరేళ్ళ పైచిలుకు ఏళ్ళ క్రితమే మహాకవి గురజాడ తన పుస్తకాలని తానే అచ్చేసుకోవడంకంటే దౌర్భాగ్యం మరొకటి లేదని వాపో యాడు. అప్పటికీ ఇప్పటికీ రచయిత దుస్థితిలో పెద్ద మార్పేమీ వచ్చినట్లు లేదు. కాని నిరుద్యోగులూ, చిరుద్యోగులూ అప్పోసప్పో చేసి, తమ పుస్తకాలు అచ్చు వేసుకొని, నానా తిప్పలూ పడి, విశ్వ విద్యాలయ తెలుగు పీఠాధిపతుల కర కమలాల ద్వారా ఆవిష్కరింప చేసుకొని, పుస్తక లోకార్పణ ముగిసిన తర్వాత, సభకు విచ్చేసిన అతిథి దేవుళ్ళకు ఆ పుస్తకాన్ని అందించి కొంత తృప్తి పొందు తుంటారు. ఆ రచయిత తన పుస్తకం గురించి పాఠక మహాశయుల సదభి ప్రాయంకోసం స్వాతి చినుకులకోసం ఎదురుచూసే చాతక పక్షుల్లాగానే వుండి పోతాడు. పట్టువదలని విక్రమార్కుల్లా మరో రెండేళ్ల తర్వాతో, మూడేళ్ళ తర్వాతో మరో పుస్తకం ప్రచురించి, మళ్లీ పాఠక దేవుళ్ళ కడగంటి చూపైనా కడు పావనం అని ఎదురుతెన్నులు చూస్తూవుండిపోతాడు. ఇది యువలోక నవలోక రచయితల కన్నీటిగాథ! ఇకపోతే, పి.రామకృష్ణ లాంటి కురువృద్ధ రచయితకు ఓదార్పు వాక్యాలు పలకడమా? శాంతం పాపమ్‌!

ఘట్టమరాజు, 99640 82076


Updated Date - 2020-08-03T06:03:13+05:30 IST