గబ్బర్ రాకతో బీజేపీలో ఉత్సాహం..
ABN , First Publish Date - 2020-11-21T17:46:34+05:30 IST
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాకతో బీజేపీలో ఉత్సాహం నెలకొంది.
హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాకతో బీజేపీలో ఉత్సాహం నెలకొంది. పవన్ తమకు మద్దతు ఇవ్వడంతో కలిసేది పది ఓట్లు అయినాసరే.. ఆ పదే పరిస్థితిని మార్చేస్తాయని కమలనాథులు అంటున్నారు. పవన్ రాకతో తమ దశ తిరుగుతుందని, గెలుపు దిశగా దూసుకువెళతామని అంటున్నారు. పోటీ చేస్తానన్న పవన్ కల్యాణ్ వెనక్కితగ్గి బీజేపీకి మద్దతు ప్రకటించారు. బీజేపీ కోసం క్యాంపెన్ కూడా చేస్తామంటున్నారు. అదే జరిగితే ఆంధ్ర సెటిలర్ల ఓట్లు తమకే వస్తాయని కమలనాథులు అనుకుంటున్నారు. గతంలో ఆంధ్ర సెటిలర్లు టీడీపీకి మద్దతు ఇచ్చినా.. విభజన తర్వాత చంద్రబాబు వచ్చినా పట్టించుకోలేదు. ఇక్కడ ఉండాలి కాబట్టే మంచిగా ఉండడమే బెటర్ అనుకుని టీఆర్ఎస్కే జై కొట్టారు. కాంగ్రెస్ వైపు చూద్దామన్నా నమ్మకం కుదరలేదు.
ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కనబడుతోంది. పైగా బీజేపీ అండ ఉంటే టీఆర్ఎస్కు భయపడనక్కరలేదనే భావన నేతల్లో, ప్రజల్లోనూ వచ్చినట్లు కనబడుతోంది. అందుకే వారంతా బీజేపీకి ఓట్లు వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారని, ఇప్పుడు వారిపై పవన్ కల్యాణ్ ప్రభావం పడితే ఫిక్స్ అయిపోతారని చెబుతున్నారు.