అందుకే సినిమాలు చేసి...: పవన్
ABN , First Publish Date - 2020-02-16T19:14:03+05:30 IST
అందుకే సినిమాలు చేసి...: పవన్
అమరావతి : డబ్బుతో చేసే రాజకీయాలు వేరు.. ఆశయాలతో చేసే రాజకీయం వేరు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో జనసేన పార్టీ ప్రజాదరణ పొందుతుందని తెలిపారు. ఇవాళ రేపల్లె నియోజకవర్గం నేతలతో పవన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి యువత ధన రాజకీయాలు లేకుండా చూడాలని పిలుపునిచ్చారు. మనకు సేవ చేసే వ్యక్తి ఎవరు అని ఆలోచించి ఓటెయ్యాలన్నారు.
రెండువేలు ఇస్తేనే..!
‘నా కుటుంబం, పార్టీ నడపడానికి డబ్బులు కావాలి. అందుకే సినిమాలు చేసి.. ఆ డబ్బుతో పార్టీ నడుపుతున్నాను. ఎవరికో కాంట్రాక్టు లు ఇప్పించి.. వారిచ్చే డబ్బును తీసుకునే వ్యక్తిని కాను. రాజకీయాల్లో కుళ్లు కుతంత్రాలు వెన్నుపోటు ఉంటాయని నాకు తెలుసు. రెండువేలు ఇస్తేనే ఓటు వేసేందుకు ప్రజలు బూత్లకు రావడం దారుణం’ అని పవన్ చెప్పుకొచ్చారు.
పోరాడుతూనే ఉంటా!
‘బీజేపీతో పొత్తు ఉంటే అనేక అభ్యంతరాలు చెప్పారు. ప్రజల మంచి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీతో కలిసి నడుస్తున్నాం. కులాలు, మతాలు పేరుతో విడగొట్టే సమాజం ప్రజలకు మంచిది కాదు. వైసీపీ రెండు నాల్కల ధోరణితో ముస్లింలే నిలదీసే పరిస్థితి వచ్చింది. జనసేన ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటుంది’ అని పవన్ స్పష్టం చేశారు.