ఆ నలుగురి మరణం వెనుక.. మరో నలుగురు
ABN , First Publish Date - 2022-01-10T08:29:30+05:30 IST
నిజామాబాద్ నగరానికి చెందిన పప్పుల సురేశ్ కుటుంబం విజయవాడలో ఆత్మహత్య వెనక నలుగురు ఫైనాన్సర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
వారిలో ఇద్దరు రాజకీయ నాయకులు!
అప్పుల వల్లే సురేశ్ కుటుంబం ఆత్మహత్య
పోస్టుమార్టం పూర్తి.. కేసు నమోదు
త్వరలో ఇందూరుకు బెజవాడ పోలీసులు
విజయవాడ, నిజామాబాద్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ నగరానికి చెందిన పప్పుల సురేశ్ కుటుంబం విజయవాడలో ఆత్మహత్య వెనక నలుగురు ఫైనాన్సర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరు నిర్మల్, మరో ఇద్దరు నిజామాబాద్కు చెందినవారని తెలుస్తోంది. వీరిలో ఇద్దరు రాజకీయ నాయకులని సమాచారం. ఆ నలుగురిపై విజయవాడ పోలీసులు ఐపీసీలోని సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా నేడోరేపో నిజామాబాద్ చేరుకోనున్నారు. శనివారం సురేశ్ భార్య శ్రీలత, చిన్నకుమారుడు ఆశిష్ సత్రంలో అధిక మోతాదులో ఇన్సూలిన్ తీసుకుని, సురేశ్ అతని పెద్ద కుమారుడు అఖిల్ కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్య చేసకున్న విషయం తెలిసిందే. సురేశ్ రాసిన సూసైడ్ నోట్, బావమరిదికి పంపిన సెల్ఫీ వీడియో, మిత్రులకు పంపిన వాయిస్ మెసేజ్ల ఆధారంగా.. ఫైనాన్సర్ల వేధింపులు భరించలేకే ఆ కుటుంబం ఆత్మహత్యకు ప్రధాన కారణాలని ప్రాథమికంగా నిర్ధారించారు. విషయం తెలియగానే మెట్పల్లిలో ఉన్న సురేశ్ బావమరిది, బంధుమిత్రులు ఓ న్యాయవాదితో కలిసి విజయవాడకు చేరుకున్నారు. ఫైనాన్సర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. సురేశ్ తన సూసైడ్ నోట్లో ఫోన్నంబర్లతో సహా పేర్కొన్న నలుగురు ఫైనాన్సర్లను విచారించేందుకు బెజవాడ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఈ కేసులో మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహాలను బంధుమిత్రులకు అప్పగించారు.
దుకాణం మారాక మారిన స్థితిగతులు!
బోధన్ మండలం ఆచన్పల్లికి చెందిన సురేశ్ కుటుంబం నిజామాబాద్ నగరంలో రెండు దశాబ్దాలుగా మెడికల్ షాపు నిర్వహిస్తోంది. నగరంలోని బస్టాండ్ ఎదురుగా ఇరవై ఏళ్ల పాటు మెడికల్ దుకాణాన్ని నిర్వహించింది. రెండేళ్ల క్రితం ఆ భవనాన్ని కూల్చేయడంతో షాపును మరో ప్రాంతానికి మార్చారు. అప్పటి నుంచి వ్యాపారంలో ఒడిదుడుకులు మొదలయ్యాయి. దీంతో అప్పులు అనివార్యమయ్యాయి. వాటికి వడ్డీలు ఎక్కువ కావడంతో.. చెల్లించడం కష్టంగా మారింది. అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలుకు డబ్బు సరిపోక.. ఫైనాన్స్ కంపెనీలో రుణం తీసుకోవాల్సి వచ్చింది. అన్ని వైపుల నుంచి అప్పుల వాళ్ల ఒత్తిడి పెరగడంతో.. మానసిక ప్రశాంతత కోసం ఆ కుటుంబం కనకదుర్గమ్మ దర్శనం కోసం మంగళవారం విజయవాడకు చేరుకుంది. శుక్రవారం ఫైనాన్స్ కంపెనీ వాళ్లు నిజామాబాద్లోని సురేశ్ ఫ్లాట్ను సీజ్ చేశారు. ఇంటికి ఫైనాన్సర్లు తాళం వేసి.. నిలువ నీడ లేకుండా చేయడంతో ఆ కుటుంబం కుమిలిపోయింది. దీంతో.. ఆత్మహత్యే శరణ్యమని భావించినట్లు తెలుస్తోంది.