పాక్ కొత్త కుట్ర.. ఉరి శిక్షపై అప్పీలుకు జాదవ్ నిరాకరణంటూ..
ABN , First Publish Date - 2020-07-09T13:51:56+05:30 IST
పాకిస్థాన్లో గూఢచర్యం కేసులో ఉరిశిక్ష పడిన భారతీయుడు కులభూషణ్ జాదవ్ ఇస్లామాబాద్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి నిరాకరించినట్లుగా పాకిస్థాన్ తెలిపింది.
క్షమాభిక్ష పిటిషన్పైనే పట్టు
పాకిస్థాన్ అదనపు ఏజీ వ్యాఖ్యలు
ఇస్లామాబాద్, జూలై 8: పాకిస్థాన్లో గూఢచర్యం కేసులో ఉరిశిక్ష పడిన భారతీయుడు కులభూషణ్ జాదవ్ ఇస్లామాబాద్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి నిరాకరించినట్లుగా పాకిస్థాన్ తెలిపింది. పాకిస్థాన్ ప్రభుత్వ అడిషనల్ అటార్నీ జనరల్(ఏఏజీ) అహ్మద్ ఇర్ఫాన్ బుధవారం ఈ విషయం మీడియా సమావేశంలో వెల్లడించారు. జాదవ్ లేదా ఆయన తరఫున ప్రతినిధి లేదా ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ ప్రతినిధి అప్పీలు చేసుకోవడానికి మే నెలలో ఒక ఆర్డినెన్స్ జారీ చేసినట్లు ఆయన చెప్పారు. ఉరి శిక్షను సవాలు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి ఈ ఏడాది జూన్ 17న జాదవ్ను ఆహ్వానించామని ఇర్ఫాన్ తెలిపారు. అయితే అప్పీలు వ్యాజ్యం దాఖలు చేసుకోరాదని జాదవ్ నిర్ణయించుకున్నారని, దానికి బదులుగా పెండింగ్లో ఉన్న తన క్షమాభిక్ష పిటిషన్పై నిర్ణయం కోసం వేచి చూడాలని భావిస్తున్నారని పాకిస్థాన్ ఏఏజీ చెప్పుకొచ్చారు.