విజయవాడ నుంచి సర్దుకుంటున్న మంత్రులు

ABN , First Publish Date - 2022-04-06T21:29:18+05:30 IST

ఏపీలో మంత్రివర్గ విస్తరణకు గడియలు దగ్గర పడ్డాయి. ప్రస్తుతం ఉన్న మంత్రుల డెడ్‌లైన్ ముగిసింది.

విజయవాడ నుంచి సర్దుకుంటున్న మంత్రులు

అమరావతి: ఏపీలో మంత్రివర్గ విస్తరణకు గడియలు దగ్గర పడ్డాయి. ప్రస్తుతం ఉన్న మంత్రుల డెడ్‌లైన్ ముగిసింది. బుధవారంతో వారి మంత్రియోగం ముగియనుంది. ఇవాళ ఒక్క రోజు మాత్రమే అమాత్యగిరి అనుభవించే అవకాశముంది. గురువారం ఆఖరిసారి మంత్రివర్గ సమావేశాన్ని సీఎం జగన్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత అందరితో రాజీనామాలు చేయిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలోనే విజయవాడ నుంచి మంత్రులు సర్దుకుంటున్నారు. ఈ నెల 11న కొత్త కేబినెట్‌ కొలువుతీరనుండడంతో.. పదవులు ఊడతాయని మంత్రులకు ముందే సిగ్నల్స్‌ వచ్చాయి. క్యాంపు కార్యాలయాలను మంత్రులు ఖాళీ చేస్తున్నారు. పేషీలోని సిబ్బందికి కోరిన చోట బదిలీలకు సిఫార్సులు చేశారు. ఇప్పటికే కొంతమంది మంత్రులు తమ కార్యాలయాలను ఖాళీ చేశారు. 


మరోవైపు మంత్రివర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని సీఎం జగన్ తొలగించడం ఖాయమని పాలకపక్షంలో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరికి ఉద్వాసన మాటెలా ఉన్నా.. ప్రస్తుతం పార్టీలో సీనియర్లుగా ఉన్న మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ధర్మాన ప్రసాదరావుతోపాటు, అనంత వెంకట్రామిరెడ్డి, సీనియర్‌ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి కేబినెట్‌లో స్థానం దక్కుతుందా లేదా అనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇంకోవైపు.. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకునే కేబినెట్‌ కూర్పు ఉంటుందని జగన్‌ విస్పష్టంగా చెప్పినా.. కొందరు మంత్రులు దింపుడు కళ్లం ఆశలతో ఉన్నట్లు తెలుస్తోంది. తమను కొనసాగించాలంటూ సిఫారసులు చేయిస్తున్నారని సమాచారం. 


మంత్రి గుమ్మనూరు జయరాం కర్ణాటకకు చెందిన మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్దనరెడ్డి ద్వారా ప్రయత్నాలు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి తొలి మంత్రివర్గ విస్తరణ సమయంలోనే అనుభవజ్ఞులైన ధర్మాన, ఆనం పేర్లు వినిపించాయి. కానీ కార్యరూపం దాల్చలేదు. ఈ నెల 11న జరిగే పునర్వ్యవస్థీకరణలోనైనా అవకాశం ఉంటుందా అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వైసీపీ అధికారంలోకి వస్తే.. నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రివర్గంలో చోటు ఖాయమని అప్పట్లోనే అందరూ భావించారు.

Updated Date - 2022-04-06T21:29:18+05:30 IST