ఉల్లి ధరలు రెండు రోజుల్లో రూ. 60 జంప్: కేంద్రం కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2020-10-23T01:41:15+05:30 IST
hike in onion price centre took a decission
న్యూఢిల్లీ : ఉల్లి ధరలు భగ్గుమన్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పంట దిగుమతులు పడిపోయిన నేపధ్యంలో... ధరలు మరోసారి ఆకాశాన్నంటాయి. ఓ వైపు పంట దెబ్బతిని రైతులు నష్టపోతే... పెరిగిన ధరలు మరోవైపుసామాన్యునికి చుక్కలు చూపిస్తున్నాయి.
ఉల్లి సరఫరా నిలిచిపోవడంతో తెలుగు రాష్ట్రాలు సహా పలు చోట్ల ధరలను పెంచారు. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధర రూ. 50 నుండి రూ. 100 వరకు ఉంటోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా చాలా వరకు పంట నష్టం జరగగా, మరోవైపు... ఉన్న కొద్ది సరుకు కూడా సరఫరా ఇబ్బందులనెదుర్కొంటోందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఉల్లి దిగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఉల్లి సరఫరాను పెంచేందుకు డిసెంబర్ 15 వ తేదీ వరకు దిగుమతులపై ఉన్న నిబంధనలలో కొన్ని సడలింపులను చేసింది.
ఖరీఫ్ లో 37 లక్షల టన్నుల ఉల్లి రావాల్సి ఉందని, అది జరిగినపక్షంలో ధరలను నియంత్రించవచ్చునని వెల్లడించింది.
కేంద్రం చర్చలు... కొరత నేపధ్యంలో ఉల్లి దిగుమతులను పెంచేలా ఇతర దేశాలల్లోని ట్రేడర్లతో భారత హైకమిషనర్ చర్చలు జరుపుతున్నారు. ఇరాన్, ఈజిప్ట్ తదితర దేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. సాధారణంగా నవంబరు చివరి వారంలో ఉల్లి కొరత తలెత్తుతుందని, ఈసారి మాత్రం అక్టోబరు లోనే ఊహించని పరిణామం చోటుచేసుకుందని ఉల్లి ట్రేడర్లు చెబుతున్నారు.
భారీగా పెరిగిన ధరలు... గత పది రోజుల్లోనే ఉల్లి ధరలు కిలోకు రూ. 11.56 పెరిగి రూ. 51.95కు చేరుకున్నాయి. గతేడాది 12.13 శాతం పెరిగి రూ. 46.33 కు చేరుకోగా, ఈ దఫా మాత్రం అంతకంటే ఎక్కువగా పెరిగింది. ఒకటి రెండు రోజుల్లోనే అరవై రూపాయల వరకు పెరిగింది.
కాగా ఉల్లి దిగుమతులను పెంచేందుకు నిబంధనల్లో కేంద్రం స్వల్ప సడలింపులనిచ్చింది. ఈ క్రమంలో... ఉల్లి ధరలు దిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు.