పంద్రాగస్టు వేళ.. ఐబీ హెచ్చరికలు
ABN , First Publish Date - 2022-08-10T10:13:21+05:30 IST
పంద్రాగస్టు నేపథ్యంలో లష్కరే తాయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రమూకలు విధ్వంసాలకు పాల్పడే ప్రమాదముందంటూ కేంద్ర నిఘా సంస్థ(ఐబీ) హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు.
తెలంగాణ పోలీసుల అప్రమత్తం
హైదరాబాద్, శంషాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): పంద్రాగస్టు నేపథ్యంలో లష్కరే తాయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రమూకలు విధ్వంసాలకు పాల్పడే ప్రమాదముందంటూ కేంద్ర నిఘా సంస్థ(ఐబీ) హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు.. కీలక నగరాలను పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు టార్గెట్గా చేసుకునే ప్రమాదముందని ఐబీ హెచ్చరించింది. దీంతో రాష్ట్ర పోలీసులు హైదరాబాద్లోని పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీలు ఉండే ప్రదేశాలు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వేస్టేషన్లు, బస్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో నిఘాను ముమ్మరం చేశారు. అటు శంషాబాద్ విమానాశ్రయంలో ఈ నెల 30 వరకు హైఅలెర్ట్ కొనసాగిస్తామని అధికారవర్గాలు తెలిపాయి.