ఓఎల్ఎక్స్ మోసగాళ్లకు వాళ్లే టార్గెట్..
ABN , First Publish Date - 2021-03-20T16:20:01+05:30 IST
మై ఆర్మీ మేజర్ హు.. దేశ్ కేలియే జాన్ దేనేవాలా హు.. అంటూ మాటలు కలిపి
హైదరాబాద్ : మై ఆర్మీ మేజర్ హు.. దేశ్ కేలియే జాన్ దేనేవాలా హు.. అంటూ మాటలు కలిపి మోసాలు చేస్తున్న భరత్పూర్ మోసగాళ్లు చదివింది తక్కువే. కేవలం సెల్ఫోన్, సిమ్ ఉపయోగించి లక్షలు కొల్లగొడుగున్న వారిలో చాలా మందికి వచ్చింది హిందీ మాత్రమే. వాళ్లు మాట్లాడగలిగేది.. మోసం చేయగలిగింది హిందీ వచ్చిన వారిని మాత్రమే. తెలంగాణలో అందులో ప్రత్యేకంగా నగరంలో హిందీ వచ్చిన వారి శాతం ఎక్కువే. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ క్రైం కేసుల్లో ఓఎల్ఎక్స్ మోసాల శాతం గణనీయంగా పెరుగుతోంది. ప్రతిరోజు ఓఎల్ఎక్స్ మోసాలపై కేసులు నమోదవుతున్నాయి. ఆన్లైన్లో ఫొటోలు సేకరించి ఓఎల్ఎక్స్లో యాడ్స్ వేయడం ఎనీడెస్క్ వంటి రిమోట్ యాప్ల వినియోగం.
ఓఎల్ఎక్స్ మోసాలే కాకుండా ఓటీపీ ఫ్రాడ్స్, కేవైసీ అప్డేట్ పేరుతో హిందీలో మాట్లాడుతూ హిందీ మాట్లాడే రాష్ట్రాలతోపాటు నగరాన్ని టార్గెట్ చేశారు. మంచి కండీషన్లో ఉన్న బైక్ తక్కువ ధరకే అంటూ... ఎంత పాత వస్తువైనా అధిక ధర చెల్లిస్తామంటూ గాలం వేస్తున్నారు. ఆర్మీ అధికారినంటూ నకిలీ ఆధార్, పాన్, ఆర్మీ ఐడీకార్డులు పంపుతారు. నమ్మి కొంత మొత్తం బదిలీ చేయగానే మరింత డబ్బు డిమాం డ్ చేస్తారు. అందినకాడికి దోచేస్తున్నారు. వీరి మాటల గారడీలో పడి డబ్బులు పోగొట్టుకున్నవారు అంతా హిందీలోనే మాట్లాడారు. అప్రమత్తంగా ఉంటే ఈ విధమైన మోసాల బారినపడకుండా తప్పించుకోవచ్చని.. ముందుగా చెల్లింపులు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దని సైబర్క్రైం పోలీసులు సూచిస్తున్నారు.