NTR Daughter: ఎన్టీఆర్ నాలుగో కుమార్తె మృతికి కారణం ఆత్మహత్యట..
ABN , First Publish Date - 2022-08-01T22:29:48+05:30 IST
ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్య సమస్యలతో ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లు..
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్య సమస్యలతో ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అనారోగ్య సమస్యల కారణంగా కొన్నాళ్లుగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు తెలిసింది. ఈ పరిణామాలే ఆత్మహత్యకు దారితీశాయని సమాచారం. జూబ్లీహిల్స్లోని ఆమె నివాసంలో ఉన్న బెడ్రూంలో ఉమా మహేశ్వరి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొన్ని నెలలుగా చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఆమె మృతికి కారణం ఆత్మహత్యగా తెలియడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఉమా మహేశ్వరి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఎన్టీఆర్ నలుగురు కుమార్తెల్లో ఉమా మహేశ్వరి అందకి కంటే చిన్న. చెల్లి కావడంతో ఆమెపై తోడ బుట్టిన వాళ్లు ఎనలేని అభిమానం చూపేవారు.
ఉమా మహేశ్వరి వయసు 52 సంవత్సరాలుగా తెలిసింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిసి ఎన్టీఆర్ కుటుంబం దిగ్భ్రాంతికి లోనైంది. నందమూరి, నారా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. బాలకృష్ణ, చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ ఉమా మహేశ్వరి నివాసానికి చేరుకున్నారు. ఇటీవలే ఉమామహేశ్వరి చిన్న కుమార్తె వివాహం జరిగింది. ఈ వివాహానికి నారా, నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.