కొవిడ్-19 ఎఫెక్ట్: ఫుడ్ ట్రక్లను నడుపుతున్న ప్రవాస భారతీయులు
ABN , First Publish Date - 2021-03-02T07:34:10+05:30 IST
కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచం అతలాకుతలం అయిపోయింది. ముఖ్యంగా వలస దారులు ఉద్యోగాలు పోగొట్టుకుని తినడానికి తిండి కూడా లేని పరిస్థితులను అనుభవించారు. ఏ దేశానికాదేశం ఉద్యోగాల విషయంలో ముందు తమ దేశస్థులకే ప్రాధాన్యం ఇచ్చుకుంటూ వచ్చాయి.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచం అతలాకుతలం అయిపోయింది. ముఖ్యంగా వలస దారులు ఉద్యోగాలు పోగొట్టుకుని తినడానికి తిండి కూడా లేని పరిస్థితులను అనుభవించారు. ఏ దేశానికాదేశం ఉద్యోగాల విషయంలో ముందు తమ దేశస్థులకే ప్రాధాన్యం ఇచ్చుకుంటూ వచ్చాయి. ఈ కారణంగా అనేక దేశాల్లో వలస దారులు ఉద్యోగాలు కోల్పోవలసి వచ్చింది. భారతీయుల విషయానికి వస్తే కరోనా కారణంగా విదేశాల్లో జీవిస్తున్న అనేక మంది ప్రవాసులు ఉద్యోగాలు పోగొట్టుకుని తిరిగి స్వదేశానికి వచ్చేశారు. ఇప్పుడు పరిస్థితులు కొంచెం మెరుగైనప్పటికి చాలా మంది ప్రవాసులు స్వదేశంలో జీవించడానికే ఇష్టపడుతున్నారు. మళ్లీ విదేశాలకు వెళ్లే ఆలోచన లేదంటూ అనేక మంది ప్రవాసీయులు ఒక నిర్ణయానికి వచ్చేశామని చెబుతున్నారు.
తమిళనాడులోని తిరుచిరపల్లి అనే నగరంలో లాక్డౌన్కు ముందు అక్కడక్కడ మాత్రమే ఫుడ్ట్రక్లు కనిపించేవి. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఒక్కసారిగా పదుల సంఖ్యలో ఫుడ్ ట్రక్లు దర్శనమిస్తున్నాయి. ఈ నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రస్తుతం 20 ఫుడ్ ట్రక్లు ఉంటే.. అందులో 15 ఫుడ్ ట్రక్లను ప్రవాస భారతీయులే నడుపుతున్నారట. కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగం కోల్పోయి స్వదేశానికి వచ్చేశామని, అతి తక్కువ ఖర్చుతో ఇక్కడే వ్యాపారం చేయాలనుకుని ఫుడ్ ట్రక్లను మొదలుపెట్టినట్టు వారు చెబుతున్నారు.
టిఫిన్ నుంచి షవర్మా, రోల్స్ ఇలా అనేక రకాల ఫుడ్ ట్రక్లను నడుపుతున్నారు. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలే లక్ష్యంగా చాలా మంది ప్రవాసులు ఈ ఫుడ్ ట్రక్లను ప్రారంభిస్తున్నారు. ప్రవాస భారతీయులతో పాటు నిరుద్యోగులు కూడా తక్కువ పెట్టుబడితో ఫుడ్ ట్రక్ల వైపే మొగ్గు చూపుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఫుడ్ ట్రక్లను నడుపుతున్న వారి వయసు 35 ఏళ్లలోపే ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి.