ఎన్నారై మహిళకు భారీ షాక్.. పచారీ సామాను కోసం సూపర్ మార్కెట్కు వెళితే..
ABN , First Publish Date - 2022-02-12T00:48:47+05:30 IST
షాపింగ్ కోసమని సూపర్ మార్కెట్కు వెళ్లిన ఎన్నారై మహిళకు భారీ షాక్ తగిలింది. ఆమె ఏమరపాటుగా ఉన్న సమయంలో ఇద్దరు దొంగలు ఆమె పర్సును చోరీ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: షాపింగ్ కోసమని సూపర్ మార్కెట్కు వెళ్లిన ఎన్నారై మహిళకు భారీ షాక్ తగిలింది. ఆమె ఏమరపాటుగా ఉన్న సమయంలో దొంగలు ఆమె పర్సును చోరీ చేశారు. పర్సులో దాదాపు రూ. 3 లక్షల విలువ చేసే అమెరికన్ డాలర్లు, ఇండియన్ కరెన్సీతో పాటు కొన్ని నగలు కూడా ఉండటంతో బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పంజాబ్ రాష్ట్రంలోని జలందర్ నగరంలో ఫిబ్రవరి 7న ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు కథనం ప్రకారం.. గురునానక్ మిషన్ చౌక వద్దనున్న ఓ సూపర్ మార్కెట్లో పచారీ సామాన్లు కొనేందుకు బాధితురాలు వెళ్లింది. ఈ క్రమంలో ఆమె తన పర్సును ట్రాలీలో పెట్టింది. ఆ తరువాత.. తనకు కావాల్సిన సామాస్లు కొనుక్కుని బిల్లింగ్ కౌంటర్ వద్దకు వెళ్లింది. అయితే.. డబ్బు చెల్లించేందుకు ఆమె పర్సు కోసం వెదకగా.. దాన్ని ఎవరో దొంగిలించినట్టు ఆమె గుర్తించింది.
షాపులోని సిబ్బంది సీసీటీవీ కెమెరాలో పరిశీలించగా దొంగల నిర్వాకం గురించి వెలుగులోకి వచ్చింది. చివరికి ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్న బృందం ఒకటి ఈ చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. వీరు ఆమె ట్రాలీ వద్ద తచ్చాడుతూ అదను చూసి ఆమె పర్సును కొట్టేశారని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.