మాతృభూమి, మాతృభాషను మర్చిపోవద్దు.. NRI లకు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సూచన!
ABN , First Publish Date - 2022-03-18T00:02:49+05:30 IST
విదేశాల్లో నివసిస్తున్న భారతీయ సంతతి వారు తమ మాతృభూమి, మాతృభాషలను మర్చిపోకూడదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గురువారం సూచించారు.
అబుదాబీ: విదేశాల్లో నివసిస్తున్న భారతీయ సంతతి వారు తమ మాతృభూమి, మాతృభాషలను మర్చిపోకూడదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గురువారం సూచించారు. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో ఉన్న ఆయన ఓ కార్యక్రమంలో అక్కడి భారతీయ సంతతి వారిని ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుమునుపు.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ హీమా కోహ్లీలను ఎన్నారైలు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ జస్టిస్ రమణ.. యూఏఈలో భారతీయుల సంఖ్య ఇతర వర్గాలతో పోలిస్తే అత్యధికమని పేర్కొన్నారు. అంతేకాకుండా.. భారతీయ సంతతి వారు అక్కడి సమాజంలో పూర్తిగా కలిసిపోయారని తెలిపారు. భారత్, యూఏఈ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు ఉన్నాయని, యూఏఈ అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో ఉందని ప్రశంసించారు. భారత దేశ అభివృద్ధిలోనూ ఎన్నారైలు తమ వంతు పాత్ర పోషిస్తున్నారన్న ఆయన.. కేరళ వరదల సమయంలో గల్ఫ్ ఎన్నారైల నుంచి అందిన సాయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు.