సంకీర్ణం తప్పదా?
ABN , First Publish Date - 2020-12-05T08:53:54+05:30 IST
అందరి అంచనాలను తారుమారు చేసిన ‘గ్రేటర్’ ఫలితాలు, ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ను కట్టబెట్టలేదు.
- మేజిక్ ఫిగర్ కు దూరంగానే కారు
- ఎక్స్ అఫిషియోలతోనూ మేయర్ పదవి కష్టమే?
హైదరాబాద్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): అందరి అంచనాలను తారుమారు చేసిన ‘గ్రేటర్’ ఫలితాలు, ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ను కట్టబెట్టలేదు. బీజేపీ, మజ్లిస్కు మించి టీఆర్ఎస్ ఎక్కువ స్థానాలను సాధించినా, ఎక్స్ అఫిషియోలతోనూ ఆ పార్టీ మేయర్ పీఠమెక్కడం కష్టమే. దీంతో హంగ్ తప్పదని విశ్లేషకులు అంటున్నారు. 150 స్థానాలున్న జీహెచ్ఎంసీలో 76 మ్యాజిక్ ఫిగర్. నేరెడ్మెట్ మినహా 149 స్థానాల ఫలితాలను ప్రకటించారు. టీఆర్ఎ్సకు 55, బీజేపీకి 48, మజ్లిస్కు 44, కాంగ్రెస్కు 2 స్థానాలు దక్కాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల అనంతర పొత్తులు, సర్దుబాట్లు తప్పనిసరయ్యే పరిస్థితి నెలకొంది.
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియోలు కూడా ఓటర్లే. అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఓటర్లుగా ఉంటారు. వీరిని కలిపిన తర్వాతనే జీహెచ్ఎంసీ మేయర్ పదవికి మేజిక్ ఫిగర్పై స్పష్టత వస్తుంది. ప్రస్తుతం గ్రేటర్ పరిఽధిలో 49 మంది ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాలో మార్పులు అనివార్యమని చెబుతున్నారు. ఉదాహరణకు మహేశ్వరం నియోజకవర్గం జీహెచ్ఎంసీతో పాటు జీహెచ్ఎంసీ ఆవల కూడా విస్తరించింది.
ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే పటోళ్ల సబితాఇంద్రారెడ్డి ఇటీవల తుక్కుగూడ మునిసిపాలిటీలో ఎక్స్ అఫిషియోగా నమోదు చేసుకున్నారు. ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం కూడా తుక్కుగూడలో ఓటు వేశారు. ఆదిభట్లలో ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ఎక్స్ అఫిషియోగా ఓటు వేశారు. నిబంధనల ప్రకారం వీరందరికీ ప్రస్తుతం జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక కోసం ఎక్స్ అఫిషియోగా చేరడానికి అవకాశం లేదని అంటున్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్.. ప్రస్తుతం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో జనవరిలో జరిగిన మునిసిపల్ ఎన్నికల సందర్భంగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఎక్స్ అఫిషియోగా నమోదు చేసుకున్నారు? అనే జాబితాను జీహెచ్ఎంసీ అధికారులు తెప్పించుకుంటున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీలో ఎక్స్ అఫిషియో జాబితాలో చేరేందుకు మరికొందరికి అవకాశం ఉంది.
రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన కె.కేశవరావు, కేఆర్ సురేశ్ రెడ్డిలకు కొత్తగా జీహెచ్ఎంసీలో నమోదు చేసుకునేందుకు వీలుంది. వీరితో పాటు గవర్నర్ కోటాలో ఇటీవల నామినేట్ అయిన ముగ్గురు ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్లకు అవకాశముంది. గ్రేటర్ ఎన్నికల ఫలితాల తీరుతో మేయర్ ఎన్నిక సమయంలో ప్రతిష్టంభన తప్పదనే చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో మజ్లిస్ కీలకంగా మారనుంది. టీఆర్ఎ్సకు మజ్లిస్ బేషరతుగా మద్దతునిస్తుందా? లేక మేయర్ లేదా డిప్యూటీ మేయర్ పదవులను కోరుతుందా? అనేది తేలాల్సి ఉంది.
సింగిల్గా కష్టమే
గ్రేటర్ జాబితాలో ఉన్న 49 మంది ఎక్స్ అఫిషియో సభ్యుల్లో టీఆర్ఎస్కు 35, మజ్లిస్కు-10, బీజేపీ-3, కాంగ్రెస్కు ఒకరు ఉన్నారు. ఇతర చోట్ల నమోదైన కొందరిని, పరిధి కాకపోయినా నమోదైన టీఆర్ఎస్ సభ్యులను జీహెచ్ఎంసీ జాబితా నుంచి తొలగించనున్నారు. ఏ విధంగా చూసినా టీఆర్ఎస్ ఎక్స్ అఫిషియోల బలం 34 దాటే పరిస్థితి లేదు. ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి టీఆర్ఎస్ బలం 89కి చేరుకుంటుంది. కానీ మేజిక్ ఫిగర్ 99ను గులాబీదళం చేరుకోలేదు. దీంతో మజ్లిస్తో కలిసి ముందుకు సాగక తప్పని పరిస్థితి. ఇలాంటి తరుణంలో సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారు..? ఎంఐఎంతో కలిసి ముందుకు నడుస్తారా..? లేకుంటే వేరే ఆలోచనలు ఏమైనా చేస్తారా..? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.