ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం.. విమాన సర్వీసులపై..
ABN , First Publish Date - 2022-02-17T21:26:48+05:30 IST
ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమాన సర్వీసులపై ఉన్న పరిమితిని ఎత్తేసింది. వీలైనంత ఎక్కువ సంఖ్యలో ఉక్రెయిన్కు విమానాలను నడపాలని ఎయిర్లై
ఎన్నారై డెస్క్: ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమాన సర్వీసులపై ఉన్న పరిమితిని ఎత్తేసింది. వీలైనంత ఎక్కువ సంఖ్యలో ఉక్రెయిన్కు విమానాలను నడపాలని ఎయిర్లైన్స్ను కోరింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
కొన్ని రోజులుగా ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉక్రెయిన్పై ఏ క్షణమైనా రష్యా దాడి చేయవచ్చనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా సహా బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాలన్నీ ఉక్రెయిన్లోని తమ పౌరులకు కీలక సూచనలు చేశాయి. సాధ్యమైనంత త్వరగా ఆ దేశం నుంచి వచ్చేయాలని కోరాయి. తాజాగా భారత ప్రభుత్వం కూడా ఉక్రెయిన్లోని భారతీయులకు ఇదే విషయాన్ని సూచించింది. అత్యవసరం అయితేనే ఉక్రెయిన్లో ఉండాలని లేదంటే.. తాత్కాలికంగా ఆ దేశాన్ని వీడాలంటూ ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. దీంతో చాలా మంది భారతీయ విద్యార్థులు, నిపుణులు ఉక్రెయిన్ను వీడేందుకు సిద్ధం అయ్యారు. అయితే తగినన్ని విమానాలు అందుబాటులో లేకపోవడంతో ఈ విషయాన్ని ఎంబసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ నేపథ్యంలో ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల మధ్య పరిమిత సంఖ్యలోనే విమానాలను నడపాలనే నిబంధనను తాజాగా ఎత్తేసింది. వీలైనన్ని ఎక్కువ విమానాలను నడపాలని ఎయిర్లైన్స్ను కోరింది. చార్టెడ్ ఫ్లైట్లను కూడా నడిపేందుకు అనుమతించింది.