ఈనెల ఉచిత బియ్యం లేవు

ABN , First Publish Date - 2022-04-26T09:37:16+05:30 IST

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన(పీఎంజీకేఏవై) కింద ఇస్తోన్న ఉచిత బియ్యం పంపిణీని ఈనెల రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది.

ఈనెల ఉచిత బియ్యం లేవు

  • రెండు నెలలకూ వచ్చే నెలలో పంపిణీ!
  • నాన్‌ సార్టెక్స్‌ నిల్వలు లేకపోవడమే కారణం
  • సార్టెక్స్‌ అయినా ఇవ్వాలంటున్న పేదలు
  • రాష్ర్టానికి భారంగా ఉచిత కోటా


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన(పీఎంజీకేఏవై) కింద ఇస్తోన్న ఉచిత బియ్యం పంపిణీని ఈనెల రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెలలో ఇవ్వాల్సిన దానితో కలిపి వచ్చే నెలలో రెండు నెలలకు కలిపి ఒకేసారి ఒక్కో వ్యక్తికి పది కిలోలు చొప్పున ఇవ్వాలని పౌరసరఫరాలశాఖ భావిస్తోంది. పౌరసరఫరాల శాఖ వద్ద నాన్‌ సార్టెక్స్‌ బియ్యం నిల్వలు లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. రెగ్యులర్‌ కోటాలో సార్టెక్స్‌ చేసిన బియ్యం ఇస్తోన్న ప్రభుత్వం, ఉచిత కోటాలో మాత్రం నాన్‌ సార్టెక్స్‌ బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. నాన్‌ సార్టెక్స్‌ బియ్యం నిల్వలను మార్చి నెల వరకూ ఇవ్వగా ఈ నెలలో కొరత ఏర్పడింది. వాస్తవానికి కరోనా తగ్గుముఖం పట్టడం, ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగియడంతో ఉచిత కోటా పంపిణీ పొడిగింపు ఉండదని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ,  కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా ఉచిత కోటాను ఒకేసారి ఆరు నెలలు పొడిగించింది.


దీంతో ఉచిత కోటాకు సిద్ధంగా లేని రాష్ర్టానికి ఈ నిర్ణయం తలనొప్పిగా మారింది. నాన్‌ సార్టెక్స్‌ బియ్యం కావాలని హడావుడిగా ఎఫ్‌సీఐని కోరింది. కానీ, రైతుల ధాన్యం సేకరించే రాష్ర్టాలకు బియ్యం తిరిగి ఇవ్వకూడదని ఎఫ్‌సీఐ స్పష్టం చేసింది. దీంతో ఈ నెలకు ఉచిత కోటాను రాష్ట్రం వాయిదా వేసుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఈ నెలలో రెగ్యులర్‌ పీడీఎస్‌ పంపిణీ కూడా చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. మరోవైపు వచ్చే నెల నుంచి బియ్యానికి నగదు బదిలీ విధానం అమలుచేయాలని ప్రభుత్వం పైలెట్‌ ప్రాజెక్టు చేపట్టింది. కానీ, ఎటూ కాకుండా దాన్ని మధ్యలోనే ఆపేసింది. ఈ కసరత్తుల మధ్య ఉచిత కోటాపై పౌరసరఫరాలశాఖ దృష్టి సారించలేదు.


ఉచితం వద్దే వద్దు!

ఉచిత కోటా బియ్యం ఇవ్వడానికి ఇబ్బంది లేదని పైకి చెబుతున్నప్పటికీ, ఇది ఎప్పుడు ఆపేస్తారా అని రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. దాదాపు కరోనా మొదటి దశ నుంచి ఉచిత కోటాను కేంద్రం పొడిగిస్తూ వస్తోంది. రాష్ట్రంలో మొత్తం 1.45 కోట్ల రేషన్‌ కార్డులుంటే, అందులో 90 లక్షల కార్డులు జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో ఉన్నాయి. వాటికి మాత్రమే రెగ్యులర్‌ పీడీఎస్‌ బియ్యంలో రాయితీగానీ, పీఎంజీకేఏవైలో ఉచితం కానీ వస్తాయి. మిగిలిన 55 లక్షల కార్డులకు రెండు కోటాల్లో పూర్తిభారం రాష్ట్రమే భరించాలి. ఎలాగూ ప్రతినెలా రెగ్యులర్‌ కోటాలో ఈ భారం తప్పదు. కానీ, ఇప్పుడు ఉచిత కోటాలో కూడా ఇవ్వాల్సి ఉన్నందున భారం రెట్టింపైంది.


దీనికి అదనంగా కార్డుదారులకు నాణ్యమైన బియ్యం ఇస్తామనే పేరుతో సార్టెక్స్‌ చేసిన బియ్యం ఇస్తోంది. సాధారణంగా ఇచ్చే వాటితో పోలిస్తే సార్టెక్స్‌ చేయడానికి కొంత అదనపు భారం పడుతుంది. ఆ భారం మోయలేక ఉచిత కోటాలో సార్టెక్స్‌ బియ్యం ఇవ్వడం లేదు. ఇప్పుడు నాన్‌ సార్టెక్స్‌ బియ్యం నిల్వలు లేక మొత్తానికే పంపిణీని ఆపేయాల్సి వచ్చింది. అన్ని రకాల నిత్యావసరాల ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో ఏవో ఒక బియ్యం ఇవ్వాలని పేదలు డిమాండ్‌ చేస్తున్నారు. ఉచిత కోటా బియ్యం ఇస్తే ఏదో ఒక రూపంలో వాటిని వినియోగించుకోవచ్చని, లేదంటే ఆర్థిక భారం ఇంకా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-04-26T09:37:16+05:30 IST