జడ్పీలకు మెండిచేయి
ABN , First Publish Date - 2022-08-01T05:48:07+05:30 IST
స్థానిక సంస్థలకు చట్టబద్ధంగా రావాల్సిన సీనరేజి నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. మైనింగ్ శాఖ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లా పరిషత్లకు ఏటా రూ.213కోట్ల మేర కేటాయిస్తోంది. ఈ మేరకు మైనింగ్ అధికారులు ప్రతీ మూణ్ణెళ్లకోసారి వివరాలతో లేఖలు పంపుతున్నారు. కానీ ప్రభు త్వం మాత్రం ఆ నిధులను జడ్పీలకు ఇవ్వకుండా మొండి చేయిచూపుతోంది. దీంతో ఎనిమిదేళ్లలో ఆ ఆరు జిల్లా పరిషత్లకు రూ.1,707 కోట్లు రాకుండా పోయా యి. ఫలితంగా జడ్పీలతో పాటు మండల పరిషత్లు, గ్రామపంచాయతీలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి.
ఏనిమిదేళ్లుగా ప్రభుత్వం నుంచి అందని సీనరేజ్ నిధులు
ఉమ్మడి జిల్లాలో రూ.1707 కోట్లకు గండి
డీఎంఎ్ఫటీ పేరుతో ఎగనామం
నిధుల కొరతను ఎదుర్కొంటున్న ఆరు జిల్లా పరిషత్లు
ఉత్సవ విగ్రహాలుగా స్థానిక సంస్థలు
గ్రామాల్లో కుంటుపడుతున్న అభివృద్ధి
స్థానిక సంస్థలకు చట్టబద్ధంగా రావాల్సిన సీనరేజి నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. మైనింగ్ శాఖ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లా పరిషత్లకు ఏటా రూ.213కోట్ల మేర కేటాయిస్తోంది. ఈ మేరకు మైనింగ్ అధికారులు ప్రతీ మూణ్ణెళ్లకోసారి వివరాలతో లేఖలు పంపుతున్నారు. కానీ ప్రభు త్వం మాత్రం ఆ నిధులను జడ్పీలకు ఇవ్వకుండా మొండి చేయిచూపుతోంది. దీంతో ఎనిమిదేళ్లలో ఆ ఆరు జిల్లా పరిషత్లకు రూ.1,707 కోట్లు రాకుండా పోయా యి. ఫలితంగా జడ్పీలతో పాటు మండల పరిషత్లు, గ్రామపంచాయతీలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి.
హనుమకొండ, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : కొత్త జిల్లాల ఆవిర్భావం నేపథ్యంలో 2019 జూలై 5న ఉమ్మడి వరంగల్ జిల్లా పరిషత్ ఆరు జిల్లా పరిషత్లుగా విడిపోయింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్లు ప్రమాణ స్వీకారం చేసి మూడేళ్లు గడిచాయి. అయినా కూడా పరిస్థితి మారలేదు. జడ్పీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రావడం పూర్తిగా తగ్గిపోయింది. దీనికితోడు సీనరేజ్ నిధులు కూడా రాకపోవడంతో వాటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిధులలేమితో కొట్టుమిట్డాడుతున్నాయి. ఎలాంటి అభివృద్ధి పనులు లేక ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయి.
గనులశాఖ నుంచి..
పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి చిన్నతరహా ఖనిజాలు తవ్వి తీసే పరిశ్రమ నుంచి గను ల శాఖకు ఆదాయం వస్తుంది. అక్కడి నుండి జడ్పీకి అందుతాయి. ప్రతీ మూడు నెలలకు దామాషా అనుసరించి జడ్పీకి, గ్రామ పంచాయతీలకు 25 శాతం చొప్పున మండల పరిషత్లకు 50 శాతం చొప్పు ఈ నిధులను కేటాయిస్తారు. వాటితో స్థానిక సంస్థల పాలక వర్గాలు వారి పరిధిలో అభివృద్ది పనులు చేపడతాయి.
ఎనిమిదేళ్లుగా..
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సీనరేజి నిధులు అందటం లేదు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అంతటికీ ఒకటే జిల్లా పరిషత్ ఉండేది. ప్రతీ త్రైమాసికంలో మైనింగ్ శాఖ నుంచి నేరుగా జడ్పీ జమ అయ్యేవి. అక్కడి నుంచి మండల పరిషత్లు, గ్రామ పంచాయతీలకు వారి నిష్పత్తి ఆధారంగా నిధులు విడుదల చేసేవారు. 2014 తర్వాత మైనింగ్ శాఖ అన్ని జిల్లాల నుంచి సీనరేజి నిధులను నేరుగా స్థానిక సంస్థలకు జమ చేయకుండా 0853 హెడ్ ఆఫ్ అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేస్తోంది.
వివరాలు పంపుతున్నా..
మైనింగ్ శాఖ నుంచి జిల్లాపరిషత్లకు నిధులు రాకున్నా ఆ శాఖ అధికారుల నుంచి ప్రతీ త్రైమాసికానికి స్థానిక సంస్థలకు కేటాయిస్తున్న సీనరేజి నిధులు.. ఆయా పరిశ్రమలు చెల్లించిన పన్నుల వివరాలతో నివేదికలను మాత్రం జడ్పీ అధికారులకు లేఖలు రూపంలో పంపుతున్నారు. సీనరేజి నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి జమ అవుతుండగా ప్రభుత్వం మాత్రం జడ్పీకి నిధులు విడుదల చేకుండా మొండి చేయిచూపుతోంది. దీంతో స్థానిక సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మండల పరిషత్ కార్యాలయాల్లో అయితే కనీసం కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి నెలకొని ఉంది.
ఖనిజ వనరులు
ఉమ్మడి జిల్లాలో బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్, స్టోన్, మెటల్, మొరం క్వారీలు సుమారు 558 క్వారీలు నడుస్తున్నాయి. గ్రానై ట్ ముడిరాళ్లు కోత కోసి పలకలుగా పాలిష్ పట్టే పరిశ్రమలు, కట్టర్లు 1000 వరకు ఉన్నాయి. వీటి ద్వారా ఖనిజ వనరులపై రాయిల్టీ, సీనరేజి చార్జీల ద్వారా ఏటా రూ.213.42 కోట్ల ఆదా యం సమకూరుతోంది. ఈమొత్తం ఉమ్మడి జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్లకు ప్రభుత్వం విడుదల చేయాలి. కానీ ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దీనితో ఎనిమిదేళ్లలో జిల్లా పరిషత్లకు రావలసిన నిధులు రూ.1,707 కోట్లు రాకుండా పోయాయి. ప్రతీ నెలా గ్రానైట్ క్వా రీల్లో ముడిరాళ్లు వెలికితీసి విక్రయించేందుకు మైనింగ్ శాఖ అ నుమతులు ఇస్తుంది. పర్మిట్లు జారీకి ప్రభుత్వానికి క్వారీ యజమానులు పన్నులు చెల్లిస్తారు. వాటి నుంచి స్థానిక సంస్థ లకు సీనరేజి నిధులు కేటాయిస్తారు. గ్రానైట్, కంకర పరిశ్రమలకు అనుమతులు జారీ చేసే సమయంలోనే పన్నుల రూపం లో ఆయా హెడ్ ఆఫ్ అకైంట్స్కు డబ్బు జమ అవుతుంది.
డీఎంఎ్ఫటీ పేరుతో..
భూగర్భ గనుల శాఖ పరిధిలోని క్వారీలు లీజుకు తీసుకొని తవ్వకాలు జరిపి రవాణా సాగిస్తే పరిణామాన్ని బట్టి మైనర్ మినరల్ సీనరేజ్ చార్జీల కింద మేజర్ మండలాలకు రాయల్టీ కింద ఆదాయం వచ్చేది. ఇలా రాయల్టీ ఇలా వసూలు చేసిన సొమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి జమ అయ్యేది. కాగా కేంద్ర ప్రభుత్వం 2015లో డిస్ట్రిక్ట్ మినరల్స్ ఫౌండేషన్ ట్రస్ట్లను (డీఎంఎ్ఫటీ) ఓ ఆర్డినెన్స్ ద్వారా ఏర్పాటు చేశాయి. మైనింగ్కు లీజ్కు ఇచ్చే సమయంలో పది శాతం రుసుము, రాయల్టీ సీనరేజ్ కింద 30 శాతం వసూలు చేసి ఈ జిల్లా ఖనిజ నిధిలో జమ చేయాల్సి ఉంటుంది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఖర్చు చేసేలా కేంద్రం ఆదేశించింది. ప్రధానంగా గనుల తవ్వకాల వల్ల ప్రభావిత గ్రామాల్లో మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయాలి. దీనికి సాకుగా చూపి జిల్లా పరిషత్లకు ఇవ్వాల్సిన సీనరేజ్ నిధులను ఎగ్గొడుతుందన్న ఆరోపణలు ఉన్నాయి.
నిధుల కొరత
జడ్పీ, మండల పరిషత్లకు నిధుల కొరత వెంటాడుతోంది. గతంలో జీఆర్జీఎఫ్, 14వ ఆర్థిక సంఘం నిధులు దండిగా వచ్చేవి. వీటికితోడు ఎన్ఆర్జీఎ్స కింద ఆదే విధంగా జనరల్ ఫండ్స్ కింద జడ్పీటీసీ, ఎంపీపీలకు జనాభా ప్రాతిపదికన నిధులు వచ్చేవి. వీటితో ప్రధానంగా లింక్ రోడ్డులు, బోరుబావుల మరమ్మతులు, స్కూళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు భవనాల నిర్మాణాలు చేపట్టేవారు. అయితే 2015-16 నుంచి కేంద్రం జీఆర్జీఎఫ్ నిధులను నిలిపివేసింది. వాటితో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా గతంలో మాదిరిగా కాకుండా గ్రామపంచాయతీలకే నేరుగా విడుదల చేస్తున్నది. ఎన్ఆర్జీఎ్సను పూర్తిగా పంచాయతీలకే అప్పగించింది. దీంతో జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు నామమాత్రం అయ్యాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం బీఆర్జీఎఫ్ పేరిట ప్రత్యేక నిధులు కేటాయించేది. ఈ నిధులను గత ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో మళ్లీ ఎలాంటి నిధులు విడుదల కావడం లేదు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు ఏడాదిలో రెండుసార్లు విడుదలవుతుంటాయి. ఈ నిధులకు సంబంధించి పనులు పూర్తయినప్పటికీ నిధులు విడుదల కావడం లేదని పాలకవర్గ సభ్యులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు పూర్తిస్థాయిలో రాకపోవడంతో స్థానికంగా ఉండే జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల నిధులపైనే ఆధారపడుతున్నారు.