కరోనా కాటుతో.. సౌదీలో భారత యువకుడు మృతి !
ABN , First Publish Date - 2020-04-04T19:11:39+05:30 IST
మహమ్మారి కరోనావైరస్ కారణంగా సౌదీ అరేబియాలోని మదీనాలో కొత్తగా పెళ్లైన భారత యువకుడు మరణించాడు.
పనూర్(కన్నూర్): మహమ్మారి కరోనావైరస్ కారణంగా సౌదీ అరేబియాలోని మదీనాలో కొత్తగా పెళ్లైన భారత యువకుడు మరణించాడు. మృతుడిని కేరళ రాష్ట్రం కన్నూర్ జిల్లా పనూర్కు చెందిన మమ్మూ, ఫౌసియా దంపతుల కుమారుడు షబ్నాస్(28)గా గుర్తించారు. ఇటీవల కరోనా బారిన పడ్డ షబ్నాస్ మదీనాలోని జర్మన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు చనిపోయినట్లు అతని బంధువులు తెలిపారు. షబ్నాస్ మరణవార్తను బంధువులు అతని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశారు.
కాగా, షబ్నాస్కు ఈ ఏడాది జనవరి 5న వివాహమైంది. మార్చి 10న అతడు తిరిగి సౌదీకి వెళ్లిపోయాడు. అక్కడ వెళ్లిన తర్వాత మహమ్మారి బారినపడి శనివారం ప్రాణాలొదిలాడు. అతనికి భార్య షహనాస్తో పాటు షబీర్, షబానా తోబుట్టువులు ఉన్నారు. షబ్నాస్ మృతితో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక సౌదీలో కొవిడ్-19 శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 2,039 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 25 మంది మృత్యువాత పడ్డారు.