న్యూయార్క్లో పూడ్చడానికి స్థలాలు సరిపోకపోవడంతో..
ABN , First Publish Date - 2020-04-08T01:48:57+05:30 IST
అమెరికాలో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య అమెరికా వ్యాప్తంగా పది వేలు దాటింది.
న్యూయార్క్: అమెరికాలో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య అమెరికా వ్యాప్తంగా పది వేలు దాటింది. న్యూయార్క్లో పరిస్థితి మాటల్లో చెప్పలేని విధంగా ఉంది. మొత్తంగా చనిపోయిన పది వేల మందిలో 4,758 మరణాలు ఒక్క న్యూయార్క్ నుంచే ఉండటం గమనార్హం. న్యూయార్క్లో చనిపోయిన వారిని పూడ్చటానికి స్థలాలు కూడా సరిపోవడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. న్యూయార్క్ రాష్ట్రంలో నమోదైన 4,758 మరణాలలో 2,738 మరణాలు కేవలం న్యూయార్క్ నగరం నుంచే నమోదయ్యాయి. దీంతో న్యూయార్క్ నగరంలో మృతదేహాలను పూడ్చడానికి స్థలాల కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, అధికారులు ముందస్తు చర్యలను ప్రారంభించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగితే హార్ట్ ఐల్యాండ్లో, అవసరమైతే పబ్లిక్ పార్క్లలో మృతదేహాలను పూడ్చనున్నట్టు అధికారులు వెల్లడించారు.
అధికారులు హార్ట్ ఐల్యాండ్నే ఎంచుకోడానికి కారణం కూడా ఉంది. 1980లో టీబీ, హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులను ఇంట్లో వారే బయటకు నెట్టేయడంతో.. వారందరూ ఈ ఐల్యాండ్లోనే తలదాచుకున్నారు. ఇక్కడే చాలా మంది చనిపోగా.. వారందరిని ప్రభుత్వం ఈ ఐల్యాండ్లోనే పూడ్చిపెట్టింది. ప్రస్తుత పరిస్థితిలో ఈ ఐల్యాండ్ అయితేనే కరెక్ట్ అని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా బారిన పడి మరణించిన వారికి అంత్యక్రియలు ఇలా జరగడం వారి కుటుంబసభ్యులతో పాటు తమకు కూడా బాధ కలిగించే అంశమేనని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. న్యూయార్క్లో శనివారం 630, ఆదివారం 594, సోమవారం 599 మరణాలు నమోదయ్యాయి. గత మూడు రోజుల్లో కేసులు సంఖ్య పెరగకుండా ఫ్లాట్గా వెళ్తుండటం కొంచెం సంతోషించాల్సిన విషయమేనని ప్రభుత్వం తెలిపింది.