పాండవుల గుట్టలో కొత్త శాసనం
ABN , First Publish Date - 2021-12-04T07:32:58+05:30 IST
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్టలో అరుదైన శాసనాన్ని చరిత్ర పరిశోధకులు ఇటీవల కనుగొన్నారు.
1100 ఏళ్ల నాటిదిగా గుర్తించిన పరిశోధకులు
హనుమకొండ, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్టలో అరుదైన శాసనాన్ని చరిత్ర పరిశోధకులు ఇటీవల కనుగొన్నారు. 1100 ఏళ్ల నాటిదిగా చెబుతున్న ఈ శాసనం తెలుగు, కన్నడ లిపిలో ఉంది. శాసనాన్ని పురావస్తు శాస్త్రవేత్త, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఇ.శివనాగిరెడ్డి, యువ చరిత్రకారుడు, టార్చ్ సంస్థ కార్యదర్శి అరవింద్ ఆర్య కనుగొన్నారు. ఈ శాసనంలో శ్రీ ఉత్పత్తి పిడుగు అని రాసి ఉందని శివనాగిరెడ్డి తెలిపారు. దీన్ని 8-9 శతాబ్దంనాటిదని నిర్ధారించినట్టు చెప్పారు. పాండవుల గుట్టలోనే గొంతెమ్మ గుహ అని పిలిచే మరొక ప్రదేశంలో శ్రీఉత్పత్తి పిడుగు అనే శాసనాన్ని 1990లో అప్పటి పురావస్తుశాఖ అధికారి ఎన్.రామకృష్ణారావు, ఎస్ఎస్ రంగాచార్యులు కొనుగొన్నారని తెలిపారు. కాజీపేట దర్గా శాసనం ఆధారంగా రాష్ట్ర కూటకాలం నాటి శిల్పుల సంఘానికి ఉత్పత్తి పిడుగు అని అర్థముందని, 8, 9 శతాబ్దాల కాలంలో ఈ ప్రదేశం రాష్ట్ర కూటుల పాలనలో ఉన్నట్టు తెలుస్తుందన్నారు.