ఆర్థిక రికవరీకి కొత్త గండం

ABN , First Publish Date - 2021-07-10T07:07:36+05:30 IST

కొవిడ్‌ శాంతించింది. ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ గాడిన పడుతున్నాయి. కంపెనీలూ వ్యాపార విస్తరణకు సిద్ధమయ్యాయి.

ఆర్థిక రికవరీకి కొత్త గండం

  • వెంటాడుతున్న ఎన్‌పీఏల భయం
  • రుణాలకు జంకుతున్న బ్యాంకులు


న్యూఢిల్లీ : కొవిడ్‌ శాంతించింది. ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ గాడిన పడుతున్నాయి. కంపెనీలూ వ్యాపార విస్తరణకు సిద్ధమయ్యాయి. అయితే బ్యాం కులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పులు పుట్టడం ఇప్పు డు మరింత కష్టంగా మారింది. ఇచ్చే అప్పులు ఎక్క డ మొండి బకాయిలు (ఎన్‌పీఏ)గా మారతాయోనని భయపడుతున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి బ్యాంకుల ఎన్‌పీఏల భారం 7.48 శాతానికి దిగొచ్చింది. కొవిడ్‌ రెండో ఉధృతితో వచ్చే ఏడాది మార్చి నాటికి  ఈ భారం 9.8 శాతానికి చేరుతుందని అంచనా. ఈ భయంతో  అప్పులు ఇచ్చినా, సవాలక్ష షరతులు, కొర్రీలు పెడుతున్నాయి. 


‘రుణ’ వృద్ధి రేటుపై ప్రభావం 

గత ఆర్థిక సంవత్సరం (2020-21) కొవిడ్‌ దెబ్బతో భారత జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 7.3 శాతానికి పడిపోయింది. ఈ సంవత్సరం మాత్రం 9.5 నుంచి 10.5 శాతం జీడీపీ వృద్ధి రేటు ఉంటుంద ని అంచనా. దీంతో బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాల వృద్ధి రేటూ 10 శాతంపైన ఉంటుందని అంచనాలు వినిపించాయి. ప్రభుత్వం, ఆర్‌బీఐ ప్రకటించిన ఉద్దీపన చర్యలూ ఇందుకు దోహదం చేస్తాయని భావించారు. రుణ వితరణలో బ్యాంకు లు, ఆర్థిక సంస్థలు చూపిస్తున్న ‘భయం’తో ఈ ఏడాది కూడా  రుణ వితరణ వృద్ధి రేటు 5.5 నుంచి ఆరు శాతం మించక పోవచ్చని భావిస్తున్నారు. రుణ వృద్ధి రేటు కంటే ఆస్తుల నాణ్యతే ముఖ్యమని బ్యాంకులు భావిస్తున్నాయి. 


ఇతర పెట్టుబడులు: ప్రస్తుతం బ్యాంకుల వద్ద పుష్కలంగా నిధులు ఉన్నాయి. ఎంత లేదన్నా ఈ మొత్తం రూ.8-9 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. బ్యాంకులు ఈ నిధు ల్ని వసూళ్లకు ఢోకా లేని ప్రభుత్వ రుణ పత్రాలు లేదా ఆర్‌బీఐ రివర్స్‌ రెపోల్లో పెట్టేందుకే ఇష్టపడుతున్నాయి. పాధ్రాన్య తా రంగాలకిచ్చే రుణాలపైనా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. 


పెట్టుబడి నిర్ణయాలు వెనక్కి: ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నపుడు కంపెనీలు వ్యాపార విస్తరణకు సిద్ధపడతాయి. సొంత నిదులు, రుణాల ద్వారా ఇందుకు అవసరమైన నిధులు సమీకరిస్తాయి. బ్యాంకుల తాజా వైఖరితో కంపెనీలూ ఇందుకు గుడ్‌బై చెప్పాయి. కొత్త రుణాల కోసం బ్యాంకులు పెడుతున్న కొర్రీలతో ఉన్న రుణాలు తీర్చి, అప్పుల భారం తగ్గించేసుకుంటున్నాయి. స్టీల్‌, సిమెంట్‌ వంటి రంగాల్లో ఇప్పటికే ఈ పరిస్థితి కనిపిస్తోంది. వ్యక్తిగత రుణాల మంజూరులోనూ బ్యాంకులు ఇదే వైఖరి అనుసరిస్తున్నాయి. దీంతో అనేక కంపెనీలు తమ వ్యాపార విస్తరణ ప్రణాళికల్ని కుదించుకుంటున్నాయి. ఈ చర్యలు ఆర్థిక రికవరీని దెబ్బతీసే సూచనలు కనిపిస్తున్నాయి. 


ఆదాయాలకూ దెబ్బ: దీనికి తోడు కొవిడ్‌ రెండో ఉధృతి కంపెనీలను బాగానే దెబ్బతీసింది. దీంతో మార్చి త్రైమాసికంతో పోలిస్తే జూన్‌ త్రైమాసికంలో కంపెనీల ఆదాయం 8 నుంచి 10 శాతం (రూ.7.3 లక్షల కోట్లు) పడిపోతుందని క్రిసి ల్‌ అంచనా. గత ఏడాది జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే ఈ పతనం మరింత భారంగా (50 శాతం) ఉంటుందని పేర్కొం ది. ఈ ఏడాది మార్చి త్రైమాసికంతో పోలిస్తే జూన్‌ త్రైమాసికంలో కంపెనీల స్థూల లాభాలూ 6 నుంచి 8 శాతం తగ్గుతాయని పేర్కొంది. గత ఏడాది జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే మాత్రం ఈ ఏడాది జూన్‌ త్రైమాసికంలో స్థూల లాభాలు 65 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. 

Updated Date - 2021-07-10T07:07:36+05:30 IST