కొత్త కనెక్షన్లపై బాదేశారు!

ABN , First Publish Date - 2022-01-04T08:00:58+05:30 IST

రాష్ట్రంలో కొత్త విద్యుత్‌ కనెక్షన్లు తీసుకుంటున్నవారిని డిస్కమ్‌లు దొంగదెబ్బ తీశాయి. డెవల్‌పమెంట్‌ (అభివృద్ధి) చార్జీలను దాదాపు రెట్టింపు చేశాయి. విద్యుత్‌ పంపిణీ వ్యయాలు పెరిగాయని....

కొత్త కనెక్షన్లపై   బాదేశారు!

కరెంటు వినియోగదారులపై అభివృద్ధి చార్జీల మోత

500 యూనిట్ల వరకు రూ.800 వసూలు

501-1,000 యూనిట్లు వాడితే రూ.1,500

డిస్కమ్‌ల ప్రతిపాదనలకు ఏపీఈఆర్‌సీ ఓకే


అమరావతి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త విద్యుత్‌ కనెక్షన్లు తీసుకుంటున్నవారిని డిస్కమ్‌లు దొంగదెబ్బ తీశాయి. డెవల్‌పమెంట్‌ (అభివృద్ధి) చార్జీలను దాదాపు రెట్టింపు చేశాయి. విద్యుత్‌ పంపిణీ వ్యయాలు పెరిగాయని.. ట్రాన్స్‌ఫార్మర్ల ఖర్చులు, లేబర్‌ ధరలు ఎప్పటికప్పుడు భారీగా పెరుగుతున్నందున అభివృద్ధి చార్జీలను పెంచుకునేందుకు అనుమతించాలని తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థలు గత ఏడాది పంపిన ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) తాజాగా ఆమోదముద్ర వేసింది. కొత్త కనెక్షన్లు తీసుకునే ముందు చెల్లించాల్సిన ఫీజులు ఒక్కసారిగా రెట్టింపు కావడంతో.. వినియోగదారులు లబోదిబోమనడం ఖాయమని ఇంధన నిపుణులు అంటున్నారు. కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలో ఈఆర్‌సీ హైదరాబాద్‌ నుంచి వెబినార్‌ విధానంలో ప్రజల నుంచి అభ్యంతరాలు సేకరించింది. అయితే.. ఇందుకు సంబంధించి బహుళ ప్రచారం లేకపోవడంతో.. రాష్ట్రంతో సంబంఽధం లేని హైదరాబాద్‌ వాసులు.. ఇతర ప్రాంతాలకు చెందిన వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పది కంటే తక్కువ సంఖ్యలోనే అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ.. ఈఆర్‌సీ వాటిని పరిగణనలోకి తీసేసుకుంది. అభివృద్ధి చార్జీలను పెంచుకునేందుకు డిస్కమ్‌లకు అవకాశం ఇచ్చేసింది.


ప్రస్తుతం గృహ విద్యుత్‌ కనెక్షన్ల నుంచి 500 యూనిట్ల వరకూ రూ.500 చొప్పున డెవల్‌పమెంట్‌ చార్జీగా వసూలు చేస్తున్నారు. దీనిని రూ.1,000కి పెంచాలని డిస్కమ్‌లు ప్రతిపాదించగా.. ఏపీఈఆర్‌సీ రూ.800కి ఆమోద ముద్ర వేసింది. అంటే రూ.300 పెంచిందన్న మాట. అదేవిధంగా 501-1,000 యూనిట్ల వరకూ ప్రస్తుతం రూ.1,200 వసూలు చేస్తుండగా.. దానిని 1,500కి  పెంచాలన్న ప్రతిపాదనను ఈఆర్‌సీ ఆమోదించింది. 1,000యూనిట్లకు మించిన కనెక్షన్లకు రూ.1,200 కనీస అభివృద్ధి చార్జీగా.. 1,000 యూనిట్లు దాటాక వాడే ప్రతి యూనిట్‌కు రూ.1,200 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇప్పుడు సదరు కనెక్షన్‌దారు దరఖాస్తు సమయంలో రూ.2,500 డెవల్‌పమెంట్‌ చార్జీగా చెల్లించాలని.. 1,000 యూనిట్లు దాటాక వాడే ప్రతి యూనిట్‌కు రూ.2,500 వసూలు చేసుకుంటామని డిస్కమ్‌లు ప్రతిపాదించగా.. ఈఆర్‌సీ ఆ చార్జీలను  రూ.1,500.. రూ.2,000గా నిర్ధారించింది. కాగా, నెలకు 250 యూనిట్లు వాడే గృహేతర విద్యుత్‌ కనెక్షన్‌కు అభివృద్ధి చార్జీ కింద రూ.300 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా రూ.600కి పెంచేశారు. 251-500 యూనట్ల వరకూ వినియోగించే మధ్యస్థాయి వినియోగదారుల నుంచి రూ.500 వసూలు చేస్తున్నారు.


దానిని రూ.1,250కి పెంచాలని డిస్కమ్‌లు ప్రతిపాదించగా.. ఈఆర్‌సీ రూ.800కి తగ్గించింది. 501-1,000 వాట్ల వరకూ వాడేవారికి డెవల్‌పమెంట్‌ చార్జీని రూ.1,200 నుంచి రూ.1,500కు పెంచారు. 1,000 వాట్ల కంటే ఎక్కువ వాడేవారి నుంచి కనీసంగా రూ.1,200.. ఆ తర్వాత ప్రతి కిలోవాట్‌కు రూ.1,200 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈఆర్‌సీ కనీస చార్జీని రూ.1,500కి పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఆపై ప్రతి కిలోవాట్‌కు రూ.2000 చొప్పున వసూలు చేసుకుందుకు అనుమతించింది. 

Updated Date - 2022-01-04T08:00:58+05:30 IST