నెలాఖరొచ్చినా.. అందని జీతాలు
ABN , First Publish Date - 2022-04-26T08:24:44+05:30 IST
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల సిబ్బందికి జీతాలు సకాలంలో అందడం లేదు. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యోగులకు మార్చి నెల వేతనాలు అందాల్సి ఉండగా, శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ ఉద్యోగులకు ఫిబ్రవరి, మార్చి నెలల వేతనాలు ఇంకా అందలేదు.
- వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ వర్సిటీల ఉద్యోగుల వెతలు
- శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో 2 నెలలు పెండింగ్
- బడ్జెట్లో కేటాయింపులున్నా ఆర్థికశాఖ క్లియరెన్స్లో జాప్యం
- ఉద్యోగుల తీవ్ర అసహనం.. రగిలిపోతున్న బోధనేతర సిబ్బంది
- వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ వర్సిటీల ఉద్యోగుల వెతలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల సిబ్బందికి జీతాలు సకాలంలో అందడం లేదు. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యోగులకు మార్చి నెల వేతనాలు అందాల్సి ఉండగా, శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ ఉద్యోగులకు ఫిబ్రవరి, మార్చి నెలల వేతనాలు ఇంకా అందలేదు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ ఉద్యోగులకు ఈనెల 21న జీతాలివ్వగా, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఇప్పటికీ వేతనాలు అందలేదు. ఒక్కో వర్సిటీ పరిధిలో వెయ్యి మందికి పైగా బోధన, బోధనేతర, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. విశ్వవిద్యాలయాల ప్రధాన కార్యాలయంతోపాటు వాటి పరిధిలోని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య కళాశాలలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగులకూ జీతాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. బడ్జెట్ జమాఖర్చులు, వేతన సవరణ వంటి సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యమైనట్టు అధికారులు చెప్తున్నా..
ఆర్థికశాఖ నుంచి క్లియరెన్స్ రాకపోవడమే కారణమని తెలుస్తోంది. కొత్త బడ్జెట్ ఏప్రిల్ నుంచి అమలులోకి రానుండగా, మార్చి నెలకు గతేడాది బడ్జెట్లోనే కేటాయించాలి. కానీ, మార్చి వేతనాలు ఇంతవరకు ఇవ్వకపోవడంపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ అధికారులు, బోధనాచార్యులకు యూజీసీ స్కేల్ ప్రకారం వేతనాలు ఇస్తున్నారు. మిగతా మినిస్టీరియల్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్లో నిధులు కేటాయిస్తుంది. కానీ, ఆర్థిక పరిస్థితి బాగోనప్పుడు జీతాలకు ఆమోదం లభించక చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. నెల గడిచి.. మళ్లీ నెలాఖరు వచ్చినా.. జీతాలు పడకపోవడంపై ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బోధనేతర సిబ్బంది రగిలిపోతున్న విషయం తెలిసి ఒకటీరెండు రోజుల్లో నిధులు విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఉద్యాన, వెటర్నరీ వర్సిటీలకు బడ్జెట్ తగ్గింపు
వ్యవసాయ విశ్వ విద్యాలయానికి 2021-22 సంవత్సరం కంటే 2022-23లో రూ.60 కోట్లు అదనంగా ప్రభుత్వం కేటాయించింది. అయితే, ఉద్యాన వర్సిటీకి రూ.10 కోట్లు, వెటర్నరీ వర్సిటీకి రూ.15కోట్లు గతేడాది కంటే తగ్గించింది. అలాగే, ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ యాక్ట్-2020 ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలో మత్స్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని, 2022-23 నుంచి అకడమిక్ ప్రోగ్రాం ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఫిషరీస్ వర్సిటీకి ఈ ఏడాది బడ్జెట్లో నిధులేమీ కేటాయించలేదు. నిధులివ్వకుండా వర్సిటీ అడకమిక్ ప్రోగ్రాం ఏ విధంగా ప్రారంభిస్తారో అధికారుల నుంచి సమాధానం లేదు.