HYD: నీరజ్ హత్య కేసు... రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు
ABN , First Publish Date - 2022-05-23T14:55:29+05:30 IST
నగరంలోని బేగంబజార్లో హత్యకు గురైన నీరజ్ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు బయటపడ్డాయి.
హైదరాబాద్: నగరంలోని బేగంబజార్లో హత్యకు గురైన నీరజ్ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు బయటపడ్డాయి. పరువు పోవడంతో పాటు అవమాన భారంతోనే నీరజ్ను హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. పెళ్లి, బాబు పుట్టాక యాదవ అహీర్ సమాజ్కు చెందిన వ్యక్తులతో నీరజ్ రెచ్చగొట్టే వాఖ్యలు చేసినట్టు నిందితులు తెలిపారు. దీంతో యాదవ్ సమాజ్లో జరిగే కార్యక్రమాలకు సంజన కుటుంబ సభ్యులను పిలవని పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సంజన కుటుంబ సభ్యులు అవమాన భారంతో కృంగిపోయారు. గత ఏడాది ఏప్రిల్లో సంజనకు కుటుంబ సభ్యులు మరో అబ్బాయితో నిశ్చితార్థం చేశారు. పెళ్లికి మూడు నెలల ముందు సంజన, నీరజ్ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. తమ కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోవడంతో సంజన ఫోటోకు కుటుంబ సభ్యులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
బాబు పుట్టాక సంజన తన తల్లితో మాట్లాడగా.. బేగం బజార్కు రావద్దని తల్లి హెచ్చరించింది. అయినప్పటికీ తల్లి హెచ్చరికను లెక్క చేయకుండా నీరజ్, సంజన బేగం బజార్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఎలాగైనా నీరజ్ను హత్య చేయాలని నిందితులు ప్లాన్ చేసుకున్నారు. గురువారం జుమేరాత్ బజార్లో కత్తులు, రాడ్లు కొన్న నిందితులు... శుక్రవారం రాత్రి నీరజ్ కోసం ఒక బాలుడితో రెక్కీ చేశారు. తన తాతతో బైక్పై వెళుతున్న నీరజ్ కంట్లో కారం చల్లిన నిందితులు ఆపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఘటనకు ముందు నిందితులు పీకల దాకా మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు.