5.75 లక్షల కేసులు

ABN , First Publish Date - 2020-09-15T09:20:16+05:30 IST

ష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. మొత్తం బాధితుల సంఖ్య 5.75లక్షలు దాటగా.. మరణాలు 5 వేల మార్కుకి చేరువయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి

5.75 లక్షల కేసులు

  • 5 వేలకు చేరువైన మరణాలు
  • రాష్ట్రంలో మరో 7,956 పాజిటివ్‌లు
  • కరోనాతో మరో 60 మంది మృతి
  • సాంఘిక సంక్షేమ శాఖలో ముగ్గురికి..
  • కర్నూలు జీజీహెచ్‌లో నలుగురికి కరోనా
  • మంత్రి అవంతి శ్రీనివాస్‌కు వైరస్‌


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. మొత్తం బాధితుల సంఖ్య 5.75లక్షలు దాటగా.. మరణాలు 5 వేల మార్కుకి చేరువయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 61,529 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 7,956 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,75,079కి చేరుకుంది. ఇక గత 24 గంటల్లో కరోనాతో 60 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 4,972కి పెరిగింది. తాజాగా తూర్పుగోదావరిలో అత్యధికంగా 1,412, పశ్చిమగోదావరిలో 1,091 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 9,764 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4,76,903కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 93,204 యాక్టివ్‌ కేసులున్నాయి. కొత్తగా నమోదైన మరణాల్లో.. చిత్తూరులో 9, అనంతపురంలో 7, కర్నూలులో 5, ప్రకాశంలో 5, విశాఖపట్నంలో 5, తూర్పుగోదావరిలో 4, కడపలో 4, కృష్ణాలో 4, శ్రీకాకుళంలో 4, విజయనగరంలో 4, పశ్చిమగోదావరిలో 4, నెల్లూరులో 3, గుంటూరులో ఇద్దరు ఉన్నారు. 


గోదావరి జిల్లాల్లో కల్లోలం

ఉభయ గోదావరి జిల్లాల్లో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఈ జిల్లాల్లో రోజుకు వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా 1,412 కేసులు బయటపడగా.. పశ్చిమ గోదావరిలో 1,091 మందికి పాజిటివ్‌ వచ్చింది. తూర్పులో మొత్తం కేసుల సంఖ్య 78,220కి చేరుకుంది. జిల్లాలో 24 గంటల్లో మరో నలుగురు కరోనాతో మృతిచెందడంతో.. మరణాలు 458కి పెరిగాయి. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖలో ముగ్గురు ఉద్యోగులకు వైరస్‌ సోకింది. ఇక పశ్చిమ గోదావరిలోనూ బాధితుల సంఖ్య 50 వేల మార్కుని దాటేసింది. కరోనాతో మరో నలుగురు మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 392కి పెరిగింది.  కర్నూలులో 341 కొత్త కేసులు వెలుగుచూడగా మరో ఐదుగురు మృత్యువాత పడ్డారు. కర్నూలు జీజీహెచ్‌లోని నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో ఓ అధికారి, ఇద్దరు హెడ్‌ నర్సులు, ఆర్థో విభాగంలోని ఓ ప్రొఫెసర్‌ కరోనా బారిన పడ్డారు. కృష్ణా జిల్లాలో కొత్తగా 201 మందికి వైరస్‌ సోకగా.. మరో నలుగురు మరణించారు. 


మంత్రి ముత్తంశెట్టికి కరోనా

రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆయన కుమారుడు శివసాయి సందీప్‌ కరోనా బారినపడినట్టు వైద్యాధికారులు నిర్ధారించారు. దీంతో వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఈ సందర్భం గా మంత్రి తనను చూసేందుకు, పరామర్శించేందుకు ఎవరూ రావొద్దని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. 



కరోనా సేవలకు ‘మెడ్‌ రోబో’

కరోనా రోగులకు సేవలు అందించేందుకు రి మోట్‌తో పనిచేసే రోబోను వాల్తేరు రైల్వే డివిజన్‌లోని డీజిల్‌ లోకోషెడ్‌ సిబ్బంది రూపొందించారు. దీనిద్వారా రైల్వే ఆస్పత్రిలోని కరోనా రోగులకు మందులు, వైద్య పరికరాలు, ఆహారం సరఫరా చేస్తున్నారు. సెన్సర్లు, వైఫైతో పనిచేసేలా దీనిని రూపొందించినట్టు డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ శ్రీవాస్తవ్‌ తెలిపారు.  

విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి

Updated Date - 2020-09-15T09:20:16+05:30 IST