మనసును విస్మరించడమే ఆత్మజ్ఞానం

ABN , First Publish Date - 2020-06-09T08:59:35+05:30 IST

మనసంటే ఏమిటి? అనే విచారణ చేస్తే మనసనేదిలేనే లేదని మనకు అనుభవమవుతుంది. మనసును నశింపజేయడానికి ఇదే సూటి మార్గం అని దీని అర్థం. భగవాన్‌ రమణ మహర్షి మానవాళికి అందించిన 31 శ్లోకాల ఆత్మజ్ఞానం..

మనసును విస్మరించడమే ఆత్మజ్ఞానం

మానసంతు కిం మార్గణేకృతే

నైవ మానసం మార్గ ఆర్జవాత్‌


మనసంటే ఏమిటి? అనే విచారణ చేస్తే మనసనేదిలేనే లేదని మనకు అనుభవమవుతుంది. మనసును నశింపజేయడానికి ఇదే సూటి మార్గం అని దీని అర్థం. భగవాన్‌ రమణ మహర్షి మానవాళికి అందించిన 31 శ్లోకాల ఆత్మజ్ఞానం.. ‘ఉపదేశ సారం’లోని 17వ శ్లోకమిది. ప్రపంచంతోనే పరుగులు పెట్టే మనసును ఆత్మయందు నిలపడానికి మొదటి 16 శ్లోకాల్లో కర్మ, భక్తి, యోగ, రాజ మార్గాలను రమణులు విశదం చేశారు. హృదయంలోనే మనసును శాంతింపజేయాలంటే క్రియ.. అంటే కర్మయోగం (1-3 శ్లోకాలు), భక్తి యోగం (4-10 శ్లోకాలు), రాజయోగం (11-16 శ్లోకాలు) అనే మార్గాలను చూపారు. విషయ వ్యవహారాల చుట్టూ తిరిగే మనసును జ్ఞానయోగం ద్వారా అరికట్టి, ఆత్మలో నిలిపి, ఆత్మగా ఉండే ఉపాయాన్ని ఈ శ్లోకం నుంచి తెలిపారు. మనసును అంతం చేస్తే అదే తత్వ దర్శనం, ఆత్మసాక్షాత్కారం. కానీ.. మనసును ఎలా అంతం చేయాలి? ఒక ఉదాహరణ. మీరు చీకట్లో నడిచి వెళ్తున్నారనుకోండి. దారిలో ఒక తాడు పడి ఉంది. దాన్ని చూసి మీరు పాము అనుకొని పొరపాటు పడతారు. అంతే భయంతో పరుగెడతారు. దాన్ని చంపడానికి కర్ర దొరుకుతుందేమోనని చూస్తారు. అయితే, అక్కడ అసలు పామే లేదని, ఉన్నది తాడేనని తెలుసుకుంటే భయపడతారా? భయపడరు కదా? ఇదంతా అక్కడ పాము ఉన్నది అనుకోవడం వల్ల వచ్చిన చిక్కే. అలాగే మనసు ఉన్నది అనుకున్నప్పుడే అన్ని చిక్కులు, ఆందోళనలు. మనసే లేకపోతే ఏ చిక్కులూ లేవు. అదే స్వస్థితి. ఆ స్థితిలో హాయి, ఆనందం ఉంటాయి. మరి మనసు లేదని ఎట్లా తెలుస్తుంది? అంటే.. ‘మనసంటే ఏమిటి? అది ఎక్కడ ఉంది? ఎలా ఉంటుంది?’ అని విచారణ చేస్తే తెలుస్తుంది. ఏదైనా ఒక వస్తువును ఉన్నది అని చెప్పాలంటే అది అన్ని కాలాల్లో, అన్ని అవస్థల్లో ఉండాలి. అదే సత్‌.


‘కాలత్రయే అపి తిష్టతి ఇతి సత్‌’

..అని శాస్త్ర నిర్వచనం. అసలు ఎప్పుడూ ఏ కాలంలోనూ లేనిది అసత్‌. ఇంతకూ మనసు సత్తా? అసత్తా? రెండూ కాదు. ఎందుకంటే మనసు జాగ్రత్‌, స్వప్నావస్థల్లో ఉంటుంది. సుషుప్తిలో ఉండదు. కాబట్టి అది సత్‌ కాదు. మరి అసత్తా అంటే.. జాగ్రత్‌, స్వప్నావస్థల్లో మన అనుభవంలో ఉంది కాబట్టి అదీ కాదు. ఇలా సత్‌, అసత్‌ కానివాటినే వేదాంతంలో మిథ్య అన్నారు. మరి ఆత్మ? అది మూడు అవస్థల్లోనూ ఉంటుంది కాబట్టి అది సత్‌. ఆత్మనిష్ఠలో నిలిచినవారికి మనసు లేదు. కానీ, మనందరికీ అనుభవమవుతూనే ఉంది. ఆత్మానుభవం పొందినవానికి ఈ ప్రపంచం లేదు. కానీ, మనందరికీ ఈ ప్రపంచం అనుభవమవుతూనే ఉంది. కాబట్టి మనసు, ప్రపంచం మిథ్య. చీకటిలో ఉన్నంతవరకూ దారిలో ఉన్నది పాము. వెలుగు వస్తే అది తాడు అని తెలుస్తుంది. నిజానికి అక్కడ ఎప్పుడూ ఉన్నది తాడే. కనుక తాడు సత్‌. పాము మిఽథ్య. కల్పితమైన, భ్రమాత్మకమైన పాముకు ఆధారం సత్యమైన తాడు లేకపోతే అసలు పాము అనే భ్రమకు ఆస్కారం లేదు. అలాగే మిథ్యయైున ఈ కల్పిత మనసుకు ఆధారం ఆత్మయే. ఆ జ్ఞానం కలిగితే ఇక కల్పిత మనసుకు స్థానం లేదు. ఆ జ్ఞానం కలగాలంటే ‘మనసంటే ఏమిటి?’ అనే విచారణ చేయాలి. ఆ విచారణతో మనసు అదృశ్యమవుతుంది. అలాగని.. ‘మనసంటే ఏమిటి? మనసంటే ఏమిటి?’ అని కేవలం ప్రశ్నించుకుంటే సరిపోదు. లోతుకు దిగి విచారణ జరపాలి. అదెలాగో రమణులు తర్వాతి శ్లోకాల్లో తెలిపారు.


- దేవిశెట్టి చలపతిరావు, 

care@srichalapathirao.com

Updated Date - 2020-06-09T08:59:35+05:30 IST