ఇసుక మాఫియాకు ప్రభుత్వం అండగా నిలవడం బాధాకరం: లోకేశ్
ABN , First Publish Date - 2021-12-07T02:24:15+05:30 IST
వైసీపీ ఇసుకాసురుల అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కడప జిల్లా నందలూరులో..
అమరావతి: వైసీపీ ఇసుకాసురుల అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కడప జిల్లా నందలూరులో టాక్టర్లలో తరలిస్తున్న ఇసుకను గ్రామస్తులు అడ్డుకున్న నేపథ్యంలో నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అన్నమయ్య ప్రాజెక్ట్ బాధితుల కన్నీళ్లు ఆరకముందే గ్రామాల్లో ఇసుక ట్రాక్టర్లు క్యూ కట్టాయంటే జగన్ రెడ్డికి జనంకంటే ధనమే ముఖ్యమని అర్థం అవుతోందని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకుల ధనదాహానికి 39 మంది జల సమాధి అయ్యారని లోకేశ్ ఆరోపించారు.
‘‘12 గ్రామాలు నీట మునిగాయి, రూ.1721 కోట్ల నష్టం వాటిల్లింది. బాధితులకు కనీస న్యాయం జరగకముందే కడప జిల్లా నందలూరు మండలం, ఆడవూరు క్వారీలో ఇసుక విక్రయాలు ప్రారంభించారు. జల ప్రళయానికి కారణమైన ఇసుక మాఫియాని కట్టడి చెయ్యాల్సిన ప్రభుత్వమే వారికి అండ నిలవడం బాధాకరం.’’ అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.