అమరావతిలో గడ్డిని కూడా జగన్ పీకలేరు: నారా లోకేశ్

ABN , First Publish Date - 2020-10-12T18:37:18+05:30 IST

కృష్ణాయపాలెంలో నారా లోకేశ్ పర్యటించారు. అమరావతి రైతులకు మద్దతు తెలిపిన ఆయన.. దీక్షా శిబిరంలో మాట్లాడారు.

అమరావతిలో గడ్డిని కూడా జగన్ పీకలేరు: నారా లోకేశ్

అమరావతి: కృష్ణాయపాలెంలో నారా లోకేశ్ పర్యటించారు. అమరావతి రైతులకు మద్దతు తెలిపిన ఆయన.. దీక్షా శిబిరంలో మాట్లాడారు. ‘‘అమరావతి ఉద్యమం 300వ రోజుకు చేరుకుంది. కేసులకు భయపడకుండా, కరోనాను లెక్క చేయకుండా ఉద్యమంలో పాల్గొన్న పెద్దలు, మహిళలకు నా నమస్కారాలు. ఇక్కడే రాజధాని ఉండాలని ఈ‌ ప్రాంత ప్రజలు ఎవరూ కోరుకోలేదు. అన్ని ప్రాంతాలకు సమ దూరం ఉండాలని, 30వేల ఎకరాలు కావాలని జగన్ రెడ్డి ఆనాడు చెప్పలేదా? ప్రతిపక్షంలో ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? అధికారంలోకి వస్తే... ఇంకా మరింత బాధ్యతతో జగన్ రెడ్డి ఉండాలి. పరిపాలన ఒకచోట, అభివృద్ధి అన్ని చోట్లా అని చంద్రబాబు చెప్పారు. మరి జగన్ రెడ్డి మూడు రాజధానల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. అమరావతిలో ఒకే కులం అని అసత్యాలు ప్రచారం చేశారు. అన్ని కులాలు, మతాల సమ్మేళనమే రాజధాని అమరావతి. ఇంత వరద వచ్చింది.. ఎక్కడైనా ఒక్క ఎకరా మునిగిందా? రాష్ట్రం గురించి ఆలోచించి 30వేలకు పైగా భూమి ఇచ్చారు. నేడు ఇలా రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. జగన్‌కు అనేక భవంతులు ఉన్నా... అమరావతిలో కట్టుకుని ఇక్కడే ఉంటామని నమ్మించారు. ఇప్పుడు ఈ తుగ్లక్ సీఎం, మెంటల్ సీఎం ప్రజలను మోసం‌ చేశారు. విశాఖలో భూదందాల కోసమే విశాఖ రాజధాని అంటున్నారు. 17నెలల కాలంలో ఒక్క అభివృద్ధి లేదు. పరిశ్రమ రాలేదు. రాష్ట్ర ప్రజలంతా ఒక్కసారి ఆలోచించండి. 300 రోజులుగా సాగుతున్న ఉద్యమానికి అందరూ మద్దతు ఇవ్వాలి. అమరావతిని కాదు.. మన గడ్డ మీద మొలిచిన గడ్డి‌ కూడా జగన్ పీకలేరు. ఈ తుగ్లక్ పాలనను తరిమి కొట్టే వరకు ఓర్పు, సహనంతో మనం పోరాటం చేయాలి. న్యాయం కోసం పోరాడుతుంటే కేసులు పెడుతున్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అని జగన్ అనే వరకు పోరు ఆగకూడదు. ఇదే నినాదాన్ని సోషల్ మీడియా‌ వేదికగా జనంలోకి తీసుకెళదాం. ఎంత సమయం పట్టినా సంయమనంతో.. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళదాం’’ అని పిలుపునిచ్చారు.

Updated Date - 2020-10-12T18:37:18+05:30 IST