‘మయోక్లోనిక్‌ ఎపిలెప్సీ’ కావొచ్చు

ABN , First Publish Date - 2020-12-08T08:47:57+05:30 IST

ఏలూరులో ప్రబలిన వింత వ్యాధికి కారణాలు ఏమైఉంటాయని గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి వైద్యులు ఆరా తీస్తున్నారు. రోగుల్లో నోటి వెంట నురుగ, తలనొప్పి, స్పృహతప్పి పడిపోవడం వంటి మూర్ఛవ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి

‘మయోక్లోనిక్‌ ఎపిలెప్సీ’ కావొచ్చు

జీజీహెచ్‌ వైద్యుల అభిప్రాయం.. గుంటూరులో ఐదుగురికి చికిత్స

బెజవాడ జీజీహెచ్‌కు ఏలూరు బాధితులు


గుంటూరు (మెడికల్‌), విజయవాడ, విశాఖపట్టణం, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): ఏలూరులో ప్రబలిన వింత వ్యాధికి కారణాలు ఏమైఉంటాయని గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి వైద్యులు ఆరా తీస్తున్నారు. రోగుల్లో నోటి వెంట నురుగ, తలనొప్పి, స్పృహతప్పి పడిపోవడం వంటి మూర్ఛవ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. వైద్య పరిభాషలో మయోక్లోనిక్‌ ఎపిలెప్సీ లక్షణాలుగా వీటిని వైద్యులు చెబుతున్నారు. ఇటువంటి లక్షణాలతో ఏలూరు నుంచి ఐదుగురు బాధితులను మెరుగైన వైద్యం కోసం ఆదివారం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. పడవల చలపతిరావు (65), పీ సాంబులింగాచారీ (51), కాయల కుసుమకుమారి (42), పడ్డా రమణమ్మ (59), మాజేటీ లక్ష్మీకుమారి ఆండాళ్లు (55) ప్రస్తుతం ఇక్కడ చికిత్స పొందుతున్నారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలం ప్రభావతి ఆధ్వర్యంలో వైద్యనిపుణుల బృందం వీరికి వైద్యసేవలు అందిస్తున్నారు. వివిధ స్పెషాలిటీలకు చెందిన ఏడుగురు వైద్యనిపుణులతో ప్రత్యేక కమిటీని నియమించారు.


ఏలూరులో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న బాధితులను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఆదివారం నలుగురు బాధితులను ఇక్కడికి తీసుకురాగా.. సోమవారం మరో 8 మందిని తరలించారు. రోగులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించామన్నారు. వ్యాధికి కారణమేంటనేది తెలియడం లేదని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే కారణం తెలిసే అవకాశం ఉందని భావించిన జీజీహెచ్‌ ఉన్నతాధికారులు సోమవారం ఐదుగురు వైద్యులతో కూడిన నిపుణుల బృందాన్ని ఏలూరుకు పంపించారు. ఈ బృందం సోమవారం ఏలూరు పట్టణంలో పర్యటించి వచ్చింది. మంగళవారం మరో వైద్య బృందం విజయవాడ జీజీహెచ్‌ నుంచి ఏలూరుకు బయల్దేరి వెళ్లనుంది.


ఉపరాష్ట్రపతి ఆరా

ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో వందలాది మంది అస్వస్థతకు గురవుతున్న అంశంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవ తీసుకున్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన సోమవారం సాయంత్రం దీనిపై మొదట కలెక్టర్‌తో మాట్లాడారు. తరువాత కేంద్ర వైద్య మంత్రి హర్షవర్ధన్‌తో మాట్లాడారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని సూచించారు. ఆ తరువాత ఎయిమ్స్‌ వైద్య బృందంతోను చర్చించారు.

Updated Date - 2020-12-08T08:47:57+05:30 IST