Munugode by-election: మునుగోడుకు చేరిన బీజేపీ నేతలు
ABN , First Publish Date - 2022-08-19T02:17:56+05:30 IST
కేంద్ర హోంమంత్రి అమిత్షా (Amit Shah) ఈ నెల 21వ తేదీన మునుగోడు పర్యటన ఖరారు కావడంతో ఆ పార్టీ కీలక నేతలు మునుగోడు బాటపట్టారు.
నల్లగొండ: కేంద్ర హోంమంత్రి అమిత్షా (Amit Shah) ఈ నెల 21వ తేదీన మునుగోడు పర్యటన ఖరారు కావడంతో ఆ పార్టీ కీలక నేతలు మునుగోడు బాటపట్టారు. మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో మొదటి రోజే అన్ని మండలాల్లో సమావేశాలు ప్రారంభమయ్యాయి. మునుగోడు (Munugode) మండల ఇన్చార్జిగా ఈటల రాజేందర్ను కేటాయించగా ఆయన ఇదే మండలంలోని తన అత్తగారి గ్రామం పలివెలలో మండల సమావేశాన్ని, నల్లగొండ జిల్లా (Nalgonda District)కు చెందిన బీజేపీ కీలకనేతలతో భేటీని నిర్వహించారు. రెండు లక్షల మంది జనసమీకరణ లక్ష్యంగా మండల సమావేశాలు ప్రారంభించారు. చౌటుప్పల్ మండలంలో జరిగిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) హాజరయ్యారు. నారాయణపురం మండల సమావేశానికి కూన శ్రీశైలంగౌడ్, మాజీ మంత్రి రవీంద్రనాయక్ హాజరయ్యారు. చండూరు మండల సమావేశానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే విజయ్పాల్రెడ్డి హాజరయ్యారు. ఓ వైపు జనసమీకరణ సమావేశాలతో పాటు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి గట్టుప్పల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాషాయం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.