క్రికెట్పైనే ఆధారపడిన వారిని ఆదుకొనేందుకు ముందుకొచ్చిన అంపైర్లు
ABN , First Publish Date - 2020-04-02T21:35:30+05:30 IST
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రముఖ క్రీడా ఈవెంట్లు వాయిదాపడ్డాయి. ముఖ్యంగా భారతదేశంలో ఈ వైరస్ తీవ్రస్థాయిలో
ముంబై: కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రముఖ క్రీడా ఈవెంట్లు వాయిదాపడ్డాయి. ముఖ్యంగా భారతదేశంలో ఈ వైరస్ తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతుండటంతో.. దీన్ని అరికట్టేందుకు ఐపీఎల్ సహా అన్ని క్రికెట్ మ్యాచ్లను వాయిదా వేశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం 21 రోజుల లాక్డౌన్ను కూడా విధించింది. ఈ నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్లపైనే ఆధారపడి ఉన్న చిన్నపాటి ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయి కష్టాల్లోపడ్డారు. వీరిలో స్థానిక మ్యాచ్లకు అంపైర్లుగా వ్యవహరించే వారు, స్కోరర్లు ప్రధానంగా ఉన్నారు.
ఇలాంటి వారిని ఆదుకొనేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ మాజీ సభ్యుడు, బీసీసీఐ మాజీ అంపైర్ గణేశ్ అయ్యర్ ముందుకొచ్చారు. క్రికెట్ మ్యాచ్లు నిలిచిపోవడంతో కష్టాల్లోపడ్డ వారిని ఆదుకొనేందుకు తన మిత్రులతో కలిసి ఆయన ‘లెండింగ్ ఏ హ్యాండ్’ అనే సంస్థను ఏర్పాటు చేశారు.
ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే టోర్నమెంట్లలో అంపైర్లుగా చేసేవారు రోజుకి రూ.2వేలు, స్కోరర్లు రూ.1,500 వేతనంగా అందుకుంటారని ఎంసీఏ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇప్పుడు మ్యాచ్లు లేకపోవడంతో వారికి రాబడి లేకుండా పోయింది. వీరిని ఆదుకొనేందుకే ఈ సంస్థను ఏర్పాటు చేశామని అయ్యర్ అన్నారు.
‘‘మ్యాచ్లు రద్దుకావడంతో ఇబ్బందులు ఎదురుకుంటున్న వారిని మేము గుర్తించాము. సంస్థలో సభ్యులు వారికి తోచిన మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నారు. ఇప్పటి వరకూ రూ.2.5లక్షలు విరాళాల రూపంలో వచ్చాయి. ముంబై క్రికెట్ అసోసియేషన్, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కూడా చాలా ఉదారంగా విరాళాలు ఇచ్చారు. శుక్రవారం నాటికి మొత్తం 47 మంది అంపైర్లు, 15 మంది స్కోరర్లు ఉన్నారని గుర్తించాము. వీరికి సహాయంగా తొలుత రూ.3వేలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమా చేస్తాము. తర్వాతి అవసరాలను మరో 7 నుంచి 10 రోజుల్లో తీర్చేందుకు కృషి చేస్తాము’’ అని అయ్యర్ స్పష్టం చేశారు.