ఉత్తరాఖండ్‌పై 725 పరుగుల తేడాతో ముంబై విజయం.. 92 ఏళ్ల నాటి రికార్డు బద్దలు

ABN , First Publish Date - 2022-06-10T00:02:33+05:30 IST

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ముంబై ప్రపంచ రికార్డు సృష్టించింది. ఉత్తరాఖండ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో

ఉత్తరాఖండ్‌పై 725 పరుగుల తేడాతో ముంబై విజయం.. 92 ఏళ్ల నాటి రికార్డు బద్దలు

న్యూఢిల్లీ: ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ముంబై ప్రపంచ రికార్డు సృష్టించింది. ఉత్తరాఖండ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఏకంగా 725 పరుగుల తేడాతో విజయం సాధించి 92 ఏళ్ల నాటి రికార్డును బద్దలుగొట్టింది. 129 ఏళ్ల రికార్డును బెంగాల్ జట్టు బద్దలుగొట్టిన తర్వాతి రోజే ముంబై ఈ ఘనత సాధించడం గమనార్హం. జార్ఖండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్ బ్యాటర్లు తొమ్మిదిమంది అర్ధ సెంచరీలు సాధించి రికార్డు నెలకొల్పారు. ఫలితంగా 129 ఏళ్ల నాటి రికార్డు బద్ధలైంది.


ఉత్తరాఖండ్‌పై విజయం సాధించిన ముంబై సెమీ ఫైనల్‌లో ఉత్తరప్రదేశ్‌తో తలపడనుంది. 41సార్లు రంజీ ట్రోపీ చాంపియన్స్ అయిన ముంబై తొలి రోజు నుంచే ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో ఇన్నింగ్స్‌ను 261/3 వద్ద డిక్లేర్  చేసి 794 పరుగుల లక్ష్యాన్ని ఉత్తరాఖండ్ ముందు ఉంచింది. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో  114 పరుగులు చేసిన ఉత్తరాఖండ్ రెండో ఇన్నింగ్స్‌లో 69 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 725 పరుగుల ఆధిక్యంతో ముంబై విజయం సాధించింది. 


ముంబై బౌలర్లు ధవల్ కులకర్ణి 11 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, లెఫ్టార్మ్ స్పిన్నర్ సాసమ్స్ ములాని 15 పరుగులిచ్చి 3, ఆఫ్ స్పిన్నర్ కోటియన్ 13 పరుగులిచ్చి మూడు వికెట్లు నేల కూల్చి ఉత్తరాఖండ్‌ను మట్టికరిపించింది. కాగా, క్వీన్స్‌లాండ్‌ను 685 పరుగుల తేడాతో ఓడించిన న్యూ సౌత్ వేల్స్ 92 ఏళ్ల షెఫీల్డ్ షీల్డ్ రికార్డును తాజాగా ముంబై బద్దలు కొట్టింది. ఇక, రంజీ ట్రోఫీలో 1953-54లో ఒడిశాను 540 పరుగుల తేడాతో ఓడించిన బెంగాల్ రికార్డు సృష్టించింది. ముంబై ఒక్క దెబ్బతో ఈ రికార్డులన్నింటినీ బద్దలుగొట్టి సరికొత్త రికార్డును తన పేర లిఖించుకుంది.

Updated Date - 2022-06-10T00:02:33+05:30 IST