ఆకు రౌడీలకు భయపడను!
ABN , First Publish Date - 2020-09-19T09:10:31+05:30 IST
ఆకు రౌడీలకు, అవాకులు, చవాకులు పేలేవారికి భయపడే పరిస్థితిలో తాను లేనని నరసాపురం వైసీపీ ఎంపీ కనుమూరి
పులివెందులలో సభపెట్టే శక్తి నాకుంది: ఎంపీ రఘురామ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఆకు రౌడీలకు, అవాకులు, చవాకులు పేలేవారికి భయపడే పరిస్థితిలో తాను లేనని నరసాపురం వైసీపీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. సీఎం జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో పదివేల మందితో బహిరంగసభ పెట్టే శక్తి తనకుందని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతల వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన తోలు తీస్తానంటూ కొందరు ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నా ఒంటిపై చెయ్యి పడితే.. కాపాడేందుకు హేమాహేమీలు నా వెనుక ఉన్నారు. పులివెందులలో కూడా నాకు మంచి స్నేహితులున్నారు. నన్ను కాపాడేందుకు పొరుగు రాష్ర్టాల్లోనూ హితులున్నారు. కరోనా తగ్గాక నేనేంటో చూపిస్తా’’ అని తనపై వ్యక్తిగత దూషణలు, హెచ్చరికలు చేసిన వైసీపీ నేతలను, ఎంపీలను హెచ్చరించారు.