ఢిల్లీ: దొంగే..దొంగ అన్నట్లుగా టీఆర్ఎస్ ఎంపీల వైఖరి ఉందని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. సకాలంలో ప్రభుత్వం ధాన్యం సేకరణ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లు ఆలస్యమవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదన్నారు. తెలంగాణ నుంచి పారాబాయిల్డ్ రైస్ సేకరణ తగ్గించమని కేంద్రం కోరిందని, కొందరు రైస్ మిల్లర్లు ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం తీసుకువచ్చి వాటిని రీసైకిల్ చేసి తిరిగి ఎఫ్సీఐకి అమ్ముతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ కనుసన్నల్లోనే రైస్ మిల్లర్ల దోపిడీ జరుగుతుందన్నారు. బియ్యం కుంభకోణంపై దర్యాప్తు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు.