‘టికెట్ల’పై నివేదిక సిద్ధం
ABN , First Publish Date - 2022-02-18T08:05:35+05:30 IST
రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లపై హోం కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను సిద్ధం చేసింది. రెండు రోజుల్లో సీఎంకు దానిని ఇవ్వాలని నిర్ణయించింది. సర్కార్ నిర్ణయం తర్వాత టికెట్ రేట్లును నిర్ధారిస్తూ
- 2 రోజుల్లో సీఎంకు నివేదన.. వారం, 10 రోజుల్లో జీవోలు!
- సచివాలయంలో కమిటీ భేటీ.. వివిధ అంశాలపై విస్తృత చర్చ
- కేంద్ర ఉద్యోగులకు మళ్లీ బయోమెట్రిక్ హాజరు
అమరావతి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లపై హోం కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను సిద్ధం చేసింది. రెండు రోజుల్లో సీఎంకు దానిని ఇవ్వాలని నిర్ణయించింది. సర్కార్ నిర్ణయం తర్వాత టికెట్ రేట్లును నిర్ధారిస్తూ జీవోలు జారీ అవుతాయని కమిటీ సభ్యులు ప్రకటించారు. గురువారం అమరావతి సచివాలయంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. త్వరలో కొన్ని పెద్ద సినిమాల రిలీజ్ ఉన్నందున టికెట్ రేట్లపై వీలువెంబడి తుది నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. అనంతరం కమిటీ సభ్యులైన తెలుగు ఫిల్మ్ చాంబర్ వైస్ చైర్మన్ ముత్యాల రాందాస్, పంపిణీదారు తుమ్మల సీతారామ్ ప్రసాద్, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్ సభ్యుడు వడ్డే ఓం ప్రకాశ్, ఎగ్జిబిటర్ వేమూరి బాలరత్నం మీడియాతో మాట్లాడారు.
అందరికీ సంతృప్తికరంగా ప్రభుత్వం మరో వారం, పది రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. 99ు తాము అడిగిన రేట్లు ఇచ్చేందుకు అధికారులు సానుకూలంగా స్పందించారని చెప్పారు. గ్రామాల్లో ఉండే మల్టీప్లెక్స్ టిక్కెట్ల రేట్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని థియేటర్లలో టికెట్ల ధరల్లో వ్యత్యాసం ఉంటుందన్నారు. మూడు శ్లాబులతో రేట్లు ఉంటాయని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీస ధర రూ.40కి దగ్గరగా, పట్టణాల్లో రూ.70కి దగ్గర ఉండే అవకాశం ఉందని చెప్పారు. రూ.100 కోట్ల పైబడిన బడ్జెట్తో తీసిన సినిమాలను ప్రత్యేకంగా పరిగణించే అంశంపైనా చర్చించినట్లు తెలిపారు. సినిమా హాళ్లలో తినుబండారాల ధరలు టికెట్ల కంటే అధికంగా ఉంటున్నాయన్న అంశంపైనా చర్చించామన్నారు. చిన్న సినిమాల ప్రదర్శనకు థియేటర్ల లభ్యత, ఐదో ఆట ప్రదర్శన తదితర అంశాలపై చర్చించినట్లు చెప్పారు. సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి భేటీలోని అంశాలపైనా చర్చ జరిగిందని చెప్పారు. కమిటీ సమావేశం మరోసారి ఉంటుందా? లేదా? అన్నది చెప్పలేమని వారు తెలిపారు.